రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా అర్జున అవార్డులు

రాష్ట్రపతి భవన్‌లో బుధవారం అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమాల్ అందుకోగా, అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు. భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ అర్జున అవార్డు అందుకుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ఏడుగురు కోచ్‌లను ద్రోణాచార్య అవార్డు, నలుగురు ఆటగాళ్లను ధ్యాన్‌చంద్‌ అవార్డుతో సత్కరించారు. స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లను రాష్ట్రపతి సత్కరించారు. వీరిద్దరూ ఈ ఏడాది థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులో సభ్యులు.
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారుల్లో ఎక్కువగా కామన్వెల్త్‌ గ్రేమ్స్‌-2022లో పాల్గొని భారత్‌కు పతకాలు అందించారు. లక్ష్యసేన్‌తో పాటు మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, రెజ్లర్ అన్షు మాలిక్‌తో పాటు భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌ ప్రజానందను అర్జున అవార్డుతో రాష్ట్రపతి సత్కరించారు.
సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (బ్యాడ్మింటన్‌-డఫ్‌) లకు అర్జున్ అవార్డులను బహుకరించారు.

కాగా, రెగ్యులర్ విభాగంలో ద్రోణాచార్య అవార్డులను జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్), సుజిత్ మాన్ (రెజ్లింగ్) అందుకున్నారు. ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), బీసీ సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)లకు అందజేశారు.

నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ అవార్డును ట్రాన్స్ స్టేడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్ లకు అందించారు.