ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మైనారిటీలుగా క్రైస్తవులు 

క్రైస్తవం అధికారిక మతంగా గల యూకేలోఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో క్రైస్తవుల సంఖ్య అక్కడి జనాభాలో సగాని కంటే దిగువకు పడిపోయింది. మరోవంక, ముస్లింల జనాభా పెరుగుతున్నది 2021 సెస్సెస్ లెక్కల ప్రకారం జనాభాలో 46.2 శాతం మంది మాత్రమే తాము క్రైస్తవులమని పేర్కొన్నారు. గత జనాభా లెక్కలతో పోలిస్తే ఇది ఏకంగా 13.1 శాతం తక్కువ.

2011 నాటి సెన్సెస్‌  ప్రకారం జనాభాలో 59.3 శాతం మంది తమది క్రైస్తవ మతమని పేర్కొన్నారు. తాము ఏ మతాన్నీ అనుసరించట్లేదన్న వారి సంఖ్య 37.2 శాతానికి పెరిగింది. గతంలో వీరి వాటా 25 శాతంగా ఉండేది. ఇక,2011 సెస్సెస్‌ ప్రకారం జనాభాలో ముస్లింల వాటా 4.9 శాతం కాగా, తాజాగా ఇది 6.5 శాతం పెరిగింది.

ఒకప్పుడు ఇంగ్లండ్, వేల్స్‌ ప్రాంతాల్లో శ్వేతజాతీయుల వాటా మొత్తం జనాభాలో 86.0 శాతం కాగా, ప్రస్తుతం జనాభాలో వారి సంఖ్య 81.6 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఆసియా సంతతి వారి సంఖ్య 4.2 మిలియన్ల నుంచి 5.5 మిలియన్లకు పెరిగింది. ఇక జనాభాలో నల్లజాతి వారి వాటా 1.8 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. పది శాతం కుటుంబాల్లో భిన్న జాతుల వారసత్వం వారు ఉన్నారు.

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్, లీసెస్టర్ లాంటి 14 ప్రాంతాల్లో శ్వేతజాతీయులు సంఖ్యాపరంగా మైనారిటీలుగా మారిపోయారు. తాజా సెన్సెస్‌లో హిందువుల వాటా 1.7 శాతానికి పెరిగింది. ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో హిందువుల సంఖ్య 10,32,775 కాగా.. సిక్కులు 5,24,140 మంది, ముస్లింలు 38,68,133 మంది, క్రైస్తవులు 2,75,22,672 మంది ఉన్నారు. తమకు ఏ మతం లేదన్న వారి సంఖ్య 2,21,62,062గా ఉన్నట్టు తాజా సెన్సెస్‌లో తేలింది.

ఈ అంకెలు తమకు సవాల్ విసురుతున్నట్లు  యార్క్ ఆర్చ్ బిషప్ స్టీఫెన్ కొత్తరెల్ తెలిపారు. ఏ మతం కానివారి సంఖ్య గణనీయంగా పెరగడం కూడా గమనార్హమని హ్యూమనిస్ట్ యుకె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూ కస్పాన్ చెప్పారు.