వివేకానంద రెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ

 మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు  ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణకు బదిలీ చేసింది. వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది.
 
సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డా. సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది. ఈ క్రమంలోనే నేడు కడప సిబిఐ కోర్టు నుంచి హైదరాబాద్‌ సిబిఐ కోర్టుకు బదిలీ చేసింది. విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర, ఆధారాలను మాయం చేయడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం.
 
వివేకా కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది.
2019 మార్చి 15 న వివేకానందరెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా ఆ తర్వాత హత్యగా తేలింది. అయితే కేసు విచారణపై వివేకా కూతురు సునీత అనుమానం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.