ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్‌ హ్యాక్‌.. రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎయిమ్స్‌ ప్రధాన సర్వర్ 23 బుధవారం  హ్యాక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు.
 
ఈ సర్వర్‌లో దాదాపు 3-4 కోట్ల మంది రోగుల డాటా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్‌ డౌన్‌ కావడంతో ఎమర్జెన్సీ ఔట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, లేబొరేటరీ విభాగాల్లో పేషెంట్‌ కేర్‌ సేవలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు.  ఈ హ్యాకింగ్‌పై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు దర్యాప్తు చేస్తున్నారు.
 
దీనిపై దోపిడీ, సైబర్‌ టెర్రరిజం కేసును ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ యూనిట్‌ నమోదు చేసింది. గత ఆరు రోజులుగా సర్వర్‌ మొత్తం హ్యాకర్ల చేతుల్లోనే ఉన్నది. దాంతో దవాఖానలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రిలోని ఓపీడీ, ఐపీడీలకు వచ్చే రోగులు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు.
 
ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్, టెలికన్సల్టేషన్ వంటి డిజిటల్ సేవలు కూడా సర్వర్‌ అంతరాయంతో ప్రభావితమయ్యాయి. అయితే, ఈ సేవలన్నీ మాన్యువల్‌గా అమలు చేస్తూ రోగులకు ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థల సూచనల మేరకు దవాఖానలోని కంప్యూటర్లలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
 
ఎయిమ్స్‌ సర్వర్‌లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్‌లు, న్యాయమూర్తులతోపాటు పలువురు వీవీఐపీల డాటాను భద్రపరిచారు. ఇలాఎండగా ఈ-హాస్పిటల్ కోసం ఈ-హాస్పిటల్ డాటాబేస్, అప్లికేషన్ సర్వర్లను ఎన్‌ఐసీ పునరుద్ధరించింది.
 
ఎన్‌ఐసీ బృందం ఎయిమ్స్‌లో ఉన్న ఇతర ఈ-హాస్పిటల్ సర్వర్‌ల నుంచి ఇన్‌ఫెక్షన్‌ను స్కాన్ చేసి శుభ్రపరుస్తున్నాయి. నెట్‌వర్క్‌ను పూర్తిగా శుభ్రపరిచేందుకు మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ-హాస్పిటల్‌ సేవలను దశలవారీగా కొనసాగించనున్నారు.