గేమింగ్ రంగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్!

భారతదేశం ఇప్పుడు గేమింగ్ రంగంలోనూ వేగంగా దూసుకుపోతోంది. మొబైల్, కంప్యూటర్ గేమ్స్ పరంగా రోజు రోజుకూ గేమర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ నికోపార్ట్నర్స్ ఈ మధ్యకాలంలో జరిపిన సర్వే ప్రకారం భారత్లోనే 396.4 మిలియన్ల మంది గేమర్లున్నట్టు వెల్లడయ్యింది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గేమర్ బేస్‌ను భారతదేశం కలిగి ఉందని ఆ నివేదిక తెలియజేస్తోంది. మార్కెట్ పరిశోధన సంస్థ నికో పార్ట్ నర్స్ అందించిన డేటా ప్రకారం టాప్ 10 ఆసియా దేశాల జాబితాలోని మొత్తం గేమర్‌లలో భారతదేశం ఇప్పుడు 50.2 శాతం వాటా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక.. రాబడిలో 21 శాతం వాటాతో 5 సంవత్సరాల వృద్ధి రేటుతో భారతదేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని ‘ది ఆసియా-10 గేమ్స్ మార్కెట్’ పేరుతో ఓ నివేదిక తెలియజేస్తోంది.

కాగా, గేమింగ్ రంగంలో భాగంగా ఆసియా టాప్-10లోని దేశాలు పిసి, మొబైల్ గేమ్ మార్కెట్ 2022లో 35.9 బిలియన్‌ డాలర్లు, 2026లో 41.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంటాయని నికోపార్టనర్స్ అంచనా వేసింది. ఆదాయం కంటే గేమర్‌ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది.

భారతదేశం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ ఆటల రాబడితో పాటు.. గేమర్‌ల సంఖ్య వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో జపాన్, కొరియా అత్యంత పరిణతి చెందిన మార్కెట్లుగా ఉన్నాయని, ఆదాయంలో 77 శాతానికి పైగా వాటా ఉందని ఈ నివేదిక పేర్కొంది.