వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉద్రిక్తంగా మారడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిల కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు మరోసారి రాళ్ల దాడి చేశారు. పోలీస్ బందోబస్తు ఉన్నా షర్మిల వాహనం అద్దాలు ధ్వంసం చేశారు.  టీఆర్ఎస్ కార్యకర్తలు వైయస్సార్ విగ్రహానికి  నిప్పు  పెట్టారు.
 
దీంతో వైసీపీ, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.  వైఎస్ విగ్రహాన్ని, పార్టీ ఫ్లెక్సీలను దగ్ధం చేయ డంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ లీడర్లు గ్రామస్తులపై కోడిగుడ్లు రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో భారీ పోలీస్ కాన్వాయ్ తో ఆమెను హైదరాబాద్ కు తరలించారు.  నర్సంపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అసలు షర్మిలకు తెలంగాణలో పాదయాత్ర చేసే హక్కే లేదని గులాబీ నేతలు నిరసనకు దిగారు. గో బ్యాక్ షర్మిల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  షర్మిల ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా, తన పాద యాత్రను అడ్డుకుని, తనను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని  సోమవారం ఉదయం వైఎస్ షర్మిల ఆరోపించారు.

టిఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఫ్లెక్సీలను చించివేశారు. షర్మిల కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పాదయాత్రలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి యాత్రను అడ్డుకునేందుకే బస్సును తగలబెట్టారని ఆమె మండిపడ్డారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించారని ఆమె తెలిపారు. బస్సు అద్దాలు రాళ్లతో పగలగొట్టి, కారుతో  దాడి చేయించి, వైఎస్సార్టీపీ కార్యకర్తలను కొట్టారని ఆమె చెప్పారు. బస్సుకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే పెద్ది  సుదర్శన్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు పర్మీషన్ ఉందని..కావాలనే పాదయాత్ర వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపించారు.