అమరావతి రాజధానిపై పూర్తిస్థాయి స్టేకు `సుప్రీం’ నిరాకరణ

అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తిస్థాయి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు రాజధాని నిర్మాణాలు పూర్తి చేయడానికి హైకోర్టు నిర్ధేశించిన కాలపరిమితిపై మాత్రం స్టే మంజూరు చేసింది.
 
ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని రైతులు కోరారు.
 
కాగా.. హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీం స్టే విధించింది.  రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీం నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.
 
ఏపీ సిఆర్ డి ఏ చట్టంలో షెడ్యూల్ 2, 3, ల్యాండ్ పూలింగ్ నియమాలు 2015 ను అమలు చేయాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి కూడా విముఖత తెలిపింది. రైతుల భూములను రాజధాని నిర్మాణానికి తప్ప వేరే అవసరాలకు ఉపయోగించకూడదన్న హైకోర్టు తీర్పుపై స్టేకి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
 
పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదన్న సుప్రీంకోర్టు ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉండగా,  పార్లమెంటు చట్టంలో సవరణ చేసే అవకాశం ఏపీ ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను మాత్రం ఎలా సవరిస్తారని ప్రశ్నించింది.  రైతులకు చట్టబద్దంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారన్న సుప్రీంకోర్టు ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారని అడిగింది. ఏపీ సిఆర్డీ ఏ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కాదా? అని ప్రశ్నించింది. ఇప్పటికే రూ.50 వేల కో్ట్ల మేరకు పెట్టిన పెట్టుబడుల సంగతేంటని అడిగింది.
 
పార్లమెంటులో చట్టానికి సవరణ చేయమని కేంద్రాన్ని రాష్ట్ర ఆశ్రయించవచ్చు కదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన హైకోర్టును కర్నూలుకు ఎలా మార్చుతారని ప్రశ్నించింది. అయితే హైకోర్టును కర్నూలుకు తరలించడం లేదని సుప్రీంకు చెప్పిన ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ తెలిపారు.