మాజీ మంత్రి అనిల్‌‌పై హిందూ, ముస్లిం పెద్దల ఆగ్రహం

నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీరుపై హిందూ, ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప భక్తుడిపై అనిల్ అనుచరుడు రాయితో దాడి చేయడంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. 
 
అయ్యప్ప దీక్షలో ఉన్న ఎమ్మెల్యే‌ అనిల్‌కుమార్ యాదవ్ ఇటీవల నెల్లూరు 6వ డివిజన్‌లో ముస్లిం టోపీ ధరించడం వివాదాస్పదం అయింది. నెల్లూరులోని అనిల్ ఇంటిని బీజేవైఎం శ్రేణులు ముట్టడించారు. అనిల్ నివాసం వద్ద పోలీసులు, బీజేవైఎం శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
 
బీజేవైఎం నేతలు, కార్యకర్తలను పోలీసులు దర్గామిట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోసారి అనిల్ ఇంటి వద్దకు వెళ్తే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. 6వ డివిజన్‌లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన మన ప్రభుత్వం గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 
 
6వ డివిజన్‌లో ఎక్కువగా ముస్లింలు ఉండడంతో అనిల్ చాలా రోజుల క్రితం అయ్యప్ప మాల ధరించి, టోపీ పెట్టుకొని హిందూవుల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బీజేవైఎం ఆధ్వరంలో ధర్నా చేపట్టారు. అనిల్ ఇంటిని ముట్టడించడంతో అనిల్ అనుచరుడు ముఖ్య అనుచరుడు శ్రావణ్ విచక్షణారహితంగా అయ్యప్ప మాల ధరించిన భక్తుడిపైన వెనక నుంచి రాయితో దాడి చేశాడు.
 
 అది మరొక వివాదానికి దారి తీసింది. శాంతియుతంగా ఇంటి ముట్టడి తాము వస్తే మాపైనే దాడులు చేస్తారా అని బీజేవైఎం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపైనే పోలీసులు, బీజేవైఎం నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా అనిల్ ఇంటి ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
అయితే ఈ విషయాన్ని హిందూ పెద్దలు, హిందూ ధార్మిక సంస్థలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి డాక్టర్ చదువు చదివిన వ్యక్తి అయ్యప్ప మాల ధరించి ముస్లింలు ధరించే టోపీ, చౌకను ధరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా టోపీ ధరించడం ఓట్లు రాకపోగా మతపరమైన గొడవలకు ఆస్కారం ఏర్పడిందని కొందరు ముస్లిం పెద్దలు సహితం ఆగ్రహం వ్యక్తం చేశారు.