ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కార్య‌క‌ర్త‌ల దాడి

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాద‌వ్‌ పై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పుతో కొట్టారు. దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఆప్ వర్గాల నుంచి స్పష్టత లేదు. 

అయితే, ఢిల్లీలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలు పార్టీ టికెట్లను అమ్మకానికి పెట్టారని, అది సహించలేకే మాటియాలా నియోజకవర్గం ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు కొట్టారని చెబుతున్నారు.

ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్యామ్ విహార్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఢిల్లీ సివిక్ పోల్స్ లో పార్టీ టికెట్ల పంపకానికి సంబంధించి ఈ మీటింగ్ లో చర్చ జరిగినట్లు సమాచారం. 

వాడివేడిగా సాగిన ఈ సమావేశం ఓ దశలో అదుపుతప్పింది. ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు గులాబ్ సింగ్ ప్రయత్నించారు. అయితే, కార్యకర్తలు ఆయనను అడ్డుకుని దాడి చేయడం మొదలు పెట్టారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు.

పారిపోతున్న గులాబ్ సింగ్ ను ఓ కార్యకర్త గల్లా పట్టుకుని మరీ చెప్పుతో కొట్టడం వీడియోలో కనిపించింది. సదరు కార్యకర్త పట్టునుంచి విడిపించుకుని గులాబ్ సింగ్ పారిపోయారు. కాగా, ఈ దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు.  కాగా, మున్సిప‌ల్ టికెట్లు అమ్మినందుకు సొంతం పార్టీ కార్య‌క‌ర్త‌లే ఎమ్మెల్యేపై దాడి చేసిన‌ట్లు బీజేపీ ఆరోపిస్తున్నా.. ఆ ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యే గులాబ్‌సింగ్ కొట్టిపారేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లే ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.

బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. నీతివంతమైన రాజకీయాలు చేస్తామని చెప్పుకునే పార్టీలో అవినీతిని ఆ పార్టీ కార్యకర్తలే భరించట్లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి జనం ఇలాగే బుద్ధి చెబుతారని సంబిత్ పాత్రా జోస్యం చెప్పారు.