గుజరాత్ ప్రచారానికి ముఖం చాటేస్తున్న రాహుల్

గుజరాత్‌కు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఆ కారణంగానే రాహుల్ బాబా ముఖం చాటేస్తున్నారని, గుజరాత్‌కు రాకుండా వేరోచోట్ల తిరుగుతున్నారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు.  గుజరాత్‌లోని తాపీ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చోటుచేసుకుందని చెప్పారు.
”బీజేపీ ప్రభుత్వం 1990 నుంచి గుజరాత్‌లో అధికారంలో ఉంది. కాంగ్రెస్ మాత్రం తాము చేసిన పనులే మాట్లాడతాయని అంటోంది. 1990 నుంచి అధికారంలోనే లేనప్పుడు కాంగ్రెస్ చేసిన పనులేమిటి? ప్రజలను ఆ పార్టీ తప్పుదారి పట్టిస్తోంది. ఏళ్ల తరబడి అధికారంలో లేని వాళ్లు ఏ పని చేశామని చెప్పుకుంటారు? కాంగ్రెస్ సిగ్గుపడాలి” అని అమిత్‌షా ధ్వజమెత్తారు.
మోదీ ప్రభుత్వం ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు రూ.1000 కోట్లు కేటాయిస్తే బీజేపీ ప్రభుత్వం దానికి రూ.1 లక్ష కోట్లకు పెంచిందని చెప్పారు. గుజరాత్‌లో ఆ పార్టీ చేసిందేమీ లేదు కాబట్టే ఎన్నికల ప్రచారానికి రాహుల్ ముఖం చేటేశారని స్పష్టం చేశారు.
ఏభై ఏళ్లుగా 370 అధికరణను రద్దు చేసే సాహసం కాంగ్రెస్ చేయలేకపోయిందని, పైగా 370 అధికరణ రద్దు చేస్తే రక్తం ఏరులై పారుతుందంటూ వ్యాఖ్యలు చేసిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అయితే మోదీ ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేసి చూపించిందని చెప్పారు.
రక్తం పారడం మాట అటుంచి, కనీసం ఒక్క రాయి విసరడానికి కూడా ఏ ఒక్కరూ సాహసం చేయలేకపోయారని తెలిపారు. దేశ భద్రతకు ముప్పు కలిగించాలని ప్రయత్నించే పాక్, ఇతర దేశాలకు ఎలా గుణపాఠం చెప్పాలో మోదీకి బాగా తెలుసునని అమిత్ షా స్పష్టం చేశారు.  పల్వామా, ఉరి దాడుల అనంతరం మోదీ పది రోజుల్లో పాక్‌లో సర్జికల్ దాడులు నిర్వహించారని, సురక్షితంగా సైనికులు వెనక్కి వచ్చారని ఆయన గుర్తు చేశారు.  ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 35,000 మంది ప్రవాస భారతీయులను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చిందని చెప్పారు.
ఏడుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ సస్పెన్షన్ వేటు
 
ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరంతా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో బీజేపీ అధిష్ఠానం క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలకు ఉపక్రమించింది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్ డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా ఉన్నారని సమాచారం.