ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చికోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేసింది. నేపాల్ లో బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన కేసినోకు వెళ్లినట్టుగా భావిస్తున్న వారికి వరుసగా నోటీసులు పంపుతూ, విచారణ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అయితే ఈడీ నోటీసులు ఇచ్చిందన్నట్టుగా వస్తున్న వార్తలను సాయికిరణ్ కొట్టిపారేస్తూ ట్వీట్ చేశారు. ఈడీ తనకు ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టం చేశారు. తాను యువ రాజకీయ నాయకుడినని, ప్రజలకు తనవంతుగా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నానని ట్వీట్ లో తెలిపారు.
మరోవైపు ఇదే అంశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్ సోమవారం ఈడీ ముందు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ విచారణకు హరీశ్ హాజరయినట్టు తెలుస్తున్నది. విదేశాల్లో క్యాసినో వ్యాపారం, ఫేమ నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఇంకోవైపు ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లు కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

More Stories
హైదరాబాద్పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు