వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు.  కాశీ, తమిళనాడు భారతీయ నాగరికత, సాంస్కృతిక కేంద్రాలని,  ఈ రెండు రెండు అతి ప్రాచీన సంస్కృత, తమిళ భాషల నిలయాలని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాశీలో 30 రోజుల పాటు ద్ర‌విడ సంస్కృతి, సంప్ర‌దాయాల గురించి వివిధ కార్య‌క్ర‌మాలు జరగనున్నాయి. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. వారి వారి విభాగాలతో సంభాషించడానికి, స్థానిక నివాసితులతో సంభాషించడానికి ఏర్పాట్లు చేశారు.
తమిళ సంగమం సందర్భంగా కాశీ నగరం సంబరాలతో నిండిపోయింది. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ఈ సంగమం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి తిరుక్కురల్, కాశీ-తమిళ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు.  తమిళ విద్యార్థులతో సంభాషించారు. తమిళనాడులోని మఠా దేవాలయాల ఆదినాములకు (మఠాధిపతులకు) కూడా గౌరవం ఇస్తూ వారి ఆశీర్వాదాలను కూడా ప్రధాని మోదీ కోరారు.

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి  ఆదిత్యనాథ్,కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన కూడా పాల్గొన్నారు. తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖ ధార్మిక నేతలను ప్రధాని సత్కరించారు. 

కాశీలో శనివారం నుంచి కాశీ-త‌మిళ సంగ‌మం ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. త‌మిళ‌నాడుకు చెందిన ద్ర‌విడ సంస్కృతి గురించి యూపీలో ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. త‌మిళ‌ వంట‌కాలు అక్క‌డ గుమ‌గుమ‌లాడ‌నున్నాయి. త‌మిళ సంగీతం కూడా కాశీలో మారుమోగ‌నున్న‌ది.

కాశీ త‌మిళ సంగ‌మం కోసం రామేశ్వ‌రం నుంచి ప్ర‌త్యేక రైలులో 216 మంది వార‌ణాసి చేరుకున్నారు. ఆ బృందానికి కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్వాగ‌తం ప‌లికారు. కాశీ త‌మిళ సంగ‌మం ఈవెంట్‌లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది త‌మిళ‌నాడు భ‌క్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు.