రాహుల్‌ సభలో నేపాల్‌ జాతీయ గీతాలాపన

జాతీయ జెండాలను రివర్స్‌లో ఎగిరేసిన ఘనత సాధించిన కాంగ్రెస్‌ నేతలు సాక్షాత్తు రాహుల్‌ గాంధీ సమావేశంలోనే నేపాల్‌ జాతీయ గీతాన్ని ఆలపించి ఔరా! అనిపించారు.  రాహుల్‌  వెంటనే తేరుకుని ‘మన జాతీయ గీతం’ ప్లే చేయండి అని చెప్పగానో సభలో గందరగోళం చెలరేగింది.
జోడో యాత్ర ఆసాంతం వినోద కార్యక్రమం వలే సాగుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలోని వాసిమ్‌లో జరిగిన సమావేశం ముగింపుగా జాతీయ గీతాలాపన అని స్వయంగా రాహుల్‌ మైక్‌లో ప్రకటించారు. అంతా నిలబడి సావధాన్‌లోకి వచ్చారు.
అయితే, నిర్వాహకులు మాత్రం నేపాల్‌ జాతీయ గీతాన్ని వేశారు. ఏం జరుగుతుందో అని సభకు వచ్చిన వారంతా నవ్వుకున్నారు. బాబు! రాష్ట్ర గీత్‌ను ప్లే చేయాలని రాహుల్‌ నిర్వాహకులకు సూచించాడు. దాంతో తప్పును సరిదిద్దుకుని నిర్వాహకులు భారత జాతీయ గీతం రికార్డు వేయడంతో రాహుల్‌ సహా అంతా గీతాన్ని అందుకున్నారు.
దీనిపై బీజేపీ సహా పలువురు నెటిజెన్లు రాహుల్‌ను సామాజిక మాధ్యమాల్లో ఓ ఆటాడుకున్నారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర కాకుండా.. అఖండ్‌ భారత్‌ జోడో యాత్ర చేస్తున్నారని అనుకుంటున్నారేమో అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నితేష్‌ రాణే దుయ్యబట్టారు.  ష్‌ రాహుల్‌జీ.. వాటీజ్‌ దిస్‌? అంటూ తమిళనాడు బీజేపీ నేత అమర్‌ ప్రసాద్‌ రెడ్డి ప్రశ్నించారు. తప్పులు మళ్లీ మళ్లీ ఒకే వ్యక్తి నుంచి జరుగడం క్షమించరాని నేరమని ఓ నెటిజెన్‌ వ్యంగ్యంగా రాశారు. ఇది రాహుల్ గాంధీపై కుట్ర అని మరో యూజర్ రాశారు.