యుద్ధ వీరులకు రాష్ట్రపతి ముర్ము నివాళి

యుద్ధ వీరులకు రాష్ట్రపతి ముర్ము నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేసుకున్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.
 
 ‘భారత దేశ సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక ఈ కార్గిల్ దివస్. 1999 నాటి కార్గిల్‌ యుద్ధంలో భరతమాతను రక్షించే క్రమంలో ప్రాణ త్యాగం చేసిన ప్రతి సైనికుడికీ నేను నివాళులర్పిస్తున్నా. యుద్ధంలో వారు చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేం. ఆ పరాక్రమం నుంచి దేశ ప్రజలు స్ఫూర్తి పొందుతూనే ఉంటారు. జై హింద్‌.. జై భారత్‌’ అని ముర్ము ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
కాగా, 1999 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  కార్గిల్ యుద్ధ అమ‌ర‌వీరుల‌కు నివాళి అర్పించారు. ఢిల్లీలోని జాతీయ వార్ మెమోరియ‌ల్ వ‌ద్ద ఆయ‌న పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళి ప్ర‌క‌టించారు. 
 
విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఎన్ రాజా సుబ్ర‌మ‌ణి, నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిర‌ల్ కే స్వామినాథ‌న్‌, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్ష‌ల్ ఏపీ సింగ్‌, సీఐఎస్సీ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ జాన్స‌న్ పీ మాథ్యూ.. జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు. ప్ర‌త్యేక పుష్ప‌గుచ్ఛాల‌ను స‌మ‌ర్పించారు. ల‌క్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌.. కార్గిల్ వీరుల‌కు నివాళి అర్పించారు. స్మృతికా వార్ మెమోరియ‌ల్ వ‌ద్ద ఆయ‌న పుష్ప‌గుచ్ఛాన్ని ఉంచారు. విజిట‌ర్స్ బుక్‌లో సంత‌కం చేశారు.