ప్రముఖుల నివాళులు, అభిమానుల అశ్రు నయనాల నడుమ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం 3.30 గంటలకు జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. కృష్ణ కుమారుడు మహేశ్బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కృష్ణ పార్థివదేహాన్ని నానక్రాంగూడలోని ఇంటి నుంచి అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో పద్మాలయ స్టూడియోకు తీసుకువచ్చారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల దాకా అభిమానులు నివాళులర్పించారు. తర్వాత రెండున్నరకు మహాప్రస్థానానికి అంతిమ యాత్ర సాగింది.
పోటెత్తిన అభిమానులు కృష్ణ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియో వద్ద అందుబాటులో ఉంచుతారని తెలుసుకున్న అభిమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఉదయం ఏడు గంటలకే తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు రావడంతో పద్మాలయ స్టూడియో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
సమయం గడుస్తున్న కొద్ది వేలాదిగా అభిమానులు తరలి వస్తుండటంతో పద్మాలయ స్టూడియో వద్ద వారిని అదుపు చేయడం ఒక దశలో కష్టంగా మారింది. స్టూడియోలోకి చొచ్చుకు పోయేందుకు కొందరు ప్రయత్నించారు. గోడలు ఎక్కి లోపలికి వెళ్లేందుకు చూశారు. దీంతో స్వల్ప లాఠీచార్జ్ చేశారు.
వీలైనంత తర్వగా అంతిమ యాత్రను మొదలు పెట్టడం మంచిదని కుటుంబ సభ్యులకు సూచించారు. కడచూపు చూడలేని వాళ్లు అంతిమ యాత్రలో పాల్గొనాలని అభిమానులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. అభిమానుల తాకిడిని ముందస్తుగా అంచనా వేయని పోలీసులు.. పరిసరాల్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడ్డారు.
పద్మాలయ, మహాప్రస్థానికి వచ్చే అన్ని రహదారులు ట్రాఫిక్జామ్ అయ్యాయి. కిలోమీటరు దూరంలోనే ఉన్న మహాప్రస్థానానికి అంతిమయాత్ర చేరుకునేందుకు అభిమానుల తాకిడి కారణంగా గంటకు పైగా పట్టింది. భారీ జన సందోహంతో తరలివచ్చిన కృష్ణ పార్థివదేహాన్ని అధికార యంత్రాంగం మహా ప్రస్థానం వద్ద రిసీవ్ చేసుకుంది.
కుటుంబ సభ్యులు, కొంత మంది ప్రముఖులను మాత్రమే లోపలికి అనుమతించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గౌరవ వందనం తర్వాత గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. తర్వాత మహేష్ బాబు మిగిలిన కార్యక్రమాలు నిర్వహించి కృష్ణకు తుది వీడ్కోలు పలికారు.
సూపర్స్టార్ కృష్ణకు నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలి వచ్చారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పలువురు మంత్రులు, సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, మురళి మోహన్, జయప్రద, అల్లు అరవింద్, కోట శ్రీనివాసరావు తదితరులు వచ్చి నివాళులు అర్పించారు.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ