ఉక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం

ఉక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ  మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై, ఆహార, ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. 

ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల 17వ జీ20 సదస్సు బుధవారం ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా జీ20 దేశాలు ‘బాలి డిక్లరేషన్’ విడుదల చేశాయి. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా ముగింపు పలకాలి. వైరాలు పక్కనపెట్టి, శాంతిని నెలకొల్పాలి’ అని స్పష్టం చేసాయి.

సంక్షోభం కొనసాగుతున్న కొద్దీ ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్త చేసాయాయి. ఇది యుద్ధాల కాలం కాదని, చర్చలు, దౌత్య విధానాలతోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ  మాటలను గుర్తు చేసుకోవాలని డిక్లరేషన్ లో జీ20 దేశాల అధినేతలు పిలుపునిచ్చారు.

గత సెప్టెంబర్ లో ఉజ్బెకిస్తాన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగిన భేటీ సందర్భంగా మోదీ  చేసిన వాఖ్యలను డిక్లరేషన్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణు యుద్ధానికి కూడా వెనకాడబోమంటూ పుతిన్ హెచ్చరించడాన్ని కూడా ఖండించారు. ఉక్రెయిన్ పై పై దాడి అన్యాయం, చట్ట విరుద్ధం, దురాక్రమణే అని తేల్చి చెప్పారు.

అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, యూఎన్ చార్టర్ కు, అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో పట్టుబడిన పౌరులు, సైనికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. అలాగే, ప్రపంచ ఎకానమీని బలోపేతం చేసేందుకు సమష్టిగా గట్టి చర్యలు చేపట్టాలని జీ20 దేశాలు నిర్ణయించాయి.

అయితే, ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై జీ20 సదస్సులో అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాకు వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పగా.. కొన్ని దేశాలు ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతోందని మాత్రమే ఆందోళన వ్యక్తం చేశాయి. డిక్లరేషన్ పై అన్ని దేశాలు ఏకాభిప్రాయానికి రావడం వెనక భారత్  కీలక పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు జిా20 సరైన వేదిక కాదని డిక్లరేషన్‌ పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించాలని కోరింది. అణ్వాయుధాల వినియోగం ముప్పును ఖండించింది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లకు తరలి వెళ్లాల్సిన గోధుమలు వంటి ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో నల్ల సముద్రం ద్వారా తరలించేందుకు చేపట్టిన చొరవను సమావేశం స్వాగతించింది.

డిజిటల్ మార్పు.. ఇదే మా మంత్రం 

వచ్చే పదేండ్లలో ప్రతి ఒక్కరికీ డిజిటల్, కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తేవడమే భారత్ లక్ష్యమని, ఇందులో జీ20 దేశాల నేతలను ఒక్కతాటి పైకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.  బుధవారం జీ20 సదస్సు ముగింపు సందర్భంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడొడొ నుంచి ప్రధాని మోదీ  జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.nఈ సందర్భంగా మోదీ  మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం డేటా’ అన్నదే భారత్ జీ20 ప్రెసిడెన్సీకి ఓవరాల్ థీమ్ అని ప్రకటించారు.