శబరిమలకు భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులు

కరోనా ఆంక్షల కారణంగా దాదాపు రెండేండ్ల పాటు పూర్తిస్థాయిలో తెరుచుకోని  కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంను   ఇప్పుడు  పూర్తిస్థాయిలో తెరుచుకోవడంతో మకరవిళక్కు సందర్భంగా మొదటిరోజే భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. బుధవారం సాయంత్రం ఆలయం తెరుచుకొంది.
 వర్చువల్‌‌ క్యూసిస్టమ్‌‌ రిజిస్ట్రేషన్ల ప్రకారం దాదాపు 49 వేల మంది భక్తులు శబరిమలకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆలయ గర్భగుడిని బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు (తంత్రి) కందరారు రాజీవరు సమక్షంలో ప్రధాన అర్చకుడు ఎన్‌‌.పరమేశ్వరన్‌‌ నంబూతిరి తెరిచారు.
కరోనా కారణంగా గత ఏడాది రోజుకు 30 వేలకు మించి భక్తులను అనుమతించ లేదు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్యపై ఎటువంటి ఆంక్షలు లేవని కేరళ దేవాలయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే 50 శాతం మేరకు ఎక్కువగా భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. 
అయ్యప్ప, మల్లికాపురం దేవాలయాలలో వచ్చే ఏడాది కాలంకు నూతనంగా నియమించిన పూజారులు ఈ నెలలోనే బాధ్యతలు స్వీకరిస్తారు.  41 రోజులు జరిగే మండల పూజా ఉత్సవాలు డిసెంబర్‌‌‌‌ 27న ముగియనున్నాయి. ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు, ఆరోగ్య, రవాణా శాఖలతో పాటు స్థానిక అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఈ సారి అయ్యప్ప మండల పూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. అలాగే జ్యోతి దర్శనానికి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అంచనా వేసిన యాజమాన్యం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.
పథనంతిట్ట జనరల్‌‌ హాస్పిటల్‌‌లో 24 గంటలూ శబరిమల వార్డు అందుబాటులో ఉంటుందని, దీంతో పాటు అన్ని సౌకర్యాలతో 18 బెడ్లను ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ అన్ని మందులు, టెస్టులు ఫ్రీగా చేస్తామని వెల్లడించింది.  చెస్ట్ పెయిన్‌‌, గుండె పోటు వచ్చిన భక్తులకు 5 నిమిషాల్లో హెల్త్‌‌ వర్కర్లు ట్రీట్‌‌మెంట్‌‌ చేసి, హాస్పిటల్‌‌కు తరలిస్తారని పేర్కొంది. వయసు పైబడిన భక్తులకు కొండపైకి ఎక్కడానికి సాయం చేసేందుకు హెల్త్‌‌ వర్కర్లు అందుబాటులో ఉంటారని చెప్పింది.
యాత్రా మార్గంలో రోడ్డు ప్రమాదాలను నివారణ, అత్యవసర పరిస్థితుల్లో సాయానికి ‘‘సేఫ్ జోన్‌‌” ప్రాజెక్ట్‌‌తో మోటార్‌‌‌‌ వెహికల్స్ డిపార్ట్ మెంట్‌‌ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 24 గంటలూ యాత్ర మార్గంలో మానిటరింగ్‌‌ ఉంటుందని, అంబులెన్స్‌‌లు, క్రేయిన్లు, క్విక్‌‌ రెస్పాన్స్‌‌ టీమ్‌‌లను కూడా నియమించినట్లు రాష్ట్ర రవాణా మంత్రి ఆంటోని రాజు తెలిపారు.
 13 వేల మంది పోలీసులతో బందోబస్తు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని మూడు మార్గాలలో భక్తుల  రాకపోకలను పర్యవేక్షిస్తుంటారు. మూడు తాత్కాలిక పోలీస్ స్టేషన్లు, బైక్ పర్యవేక్షక దళాల ఏర్పాటుతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలను మోహరింపచేశారు.
అన్ని విశ్రాంతి ప్రదేశాలలో, భక్తుల రాక మార్గాలలో తాగునీరు, నిద్రపోయే సదుపాయం, మరుగు దొడ్ల సౌకర్యాలను ఓ అధికారుల బృందం పర్యవేక్షిస్తూ ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా విపత్తు యాజమాన్య కమిటీ చైర్మన్ డా. దివ్య ఎస్ అయ్యర్ తెలిపారు.  తిరిగి  మకరావిళ్లకు కోసం దేవాలయాన్ని డిసెంబర్ 30 నుండి సంక్రాంతి జనవరి 14 వరకు  తెరిచి ఉంచుతారు.