బలవంతపు మతమార్పిడితో దేశ భద్రతపై ప్రభావం

బలవంతపు మతమార్పిడి చాలా తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భద్రతపై ఇది ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  వాటిని నివారించకపోతే అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు వెంటనే రంగంలోకి దిగాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  
ఈ నేపథ్యంలో బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలను కోరింది.  వారంలోగా స్పందించి దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బలవంతపు మతమార్పిడులను నేరంగా పరిగణించాలని ఢిల్లీ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ డిమాండ్‌ చేశారు.
బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని లేదా భారత శిక్షాస్మృతిలో ఈ నేరాన్ని చేర్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ సమస్య ఏదో ఒక ప్రాంతానికి చెందినది కాదని, దేశమంతా ఈ సమస్య ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంఆర్‌ షా, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై సోమవారం విచారణ జరిపింది.
‘బలవంతపు మత మార్పిడి చాలా తీవ్రమైన సమస్య. ఇది అంతిమంగా దేశ భద్రతతోపాటు పౌరుల మనస్సాక్షి, మత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించింది. బలవంతపు మతమార్పిడులను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో బలవంతపు మతమార్పిడుల నిరోధానికి ఎలాంటి చర్యలు ప్రతిపాదిస్తారో చెప్పాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. బలవంతపు మతమార్పిడులను ఆపి తీరాల్సిందేనని స్పష్టం చేస్తూ  వాటిని ఆపేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు నిర్దేశించింది.