రష్యా సాగిస్తోన్న యుద్ధం ముగింపునకు ఇదే ఆరంభం 

రష్యా ఆక్రమించిన ఖేర్సన్ సిటీని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఆ దేశం సాగిస్తున్న యుద్ధం ముగింపునకు ఆరంభం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. తమ సైనికుల ధైర్యసాహసాల వల్లే కీలకమైన నగరాన్ని తిరిగి దక్కించుకున్నామని ఆయన పేర్కొన్నారు. 
 
‘రష్యాదాడుల్లో ఖేర్సన్‌లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో క్లిష్ట సవాళ్లు ఎదురైనప్పటికీ.. మా బలమైన సైన్యం ఈ ప్రాంతాన్ని శత్రువుల నుంచి తిరిగి తక్కించుకుకోగలిగింది. యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం’ అని పేర్కొన్నారు.
 
ఈ విజయంతో రష్యాకు గుణపాఠం చెప్పారని తన సైనికులను మెచ్చుకున్నారు. సోమవారం అకస్మాత్తుగా ఖేర్సన్ నగరంలో పర్యటించి జెలెన్ స్కీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇంతకాలం రష్యా సైన్యం అధీనంలో ఉన్న ఖేర్సన్ సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సహా పలు ప్రాంతాలను తనిఖీ చేశారు.
 ఆ తర్వాత సైనికులతో కలిసి జెలెన్ స్కీ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, రష్యాను తక్కువ అంచనా వేయొద్దని జెలెన్ స్కీకి పలు దేశాలు సూచిస్తున్నాయి.  రష్యా సైనిక బలగాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఖేర్సన్ నుంచి వెనక్కి మళ్లడంలో పుతిన్ ఆలోచనలను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించాయి.
ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఆక్రమించిన నాలుగు కీలక నగరాల్లో ఖేర్సన్ కూడా ఒకటి.  మార్చి నెల‌లో ఖేర్సన్ సిటీని ర‌ష్యా ద‌ళాలు హ‌స్తగ‌తం చేసుకున్నాయి.  ఉక్రెయిన్ కు చెందిన ఈ నగరాలలో రెఫరెండం నిర్వహించి రష్యా తన భూభాగంలో కలిపేసుకుంది. ఇకపై డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపరోజియా నగరాలు రష్యావేనని ప్రకటించింది.
ఆ నగరాలపై దాడి చేస్తే రష్యా భూభాగంపై దాడిగానే పరిగణించి ప్రతిదాడులకు దిగుతామని ఉక్రెయిన్ ను హెచ్చరించింది. అయితే, ఈ నగరాలను కాపాడుకోవడం రష్యాకు అసాధ్యంగా మారింది.  దీంతో కిందటి శుక్రవారం (ఈ నెల 11న) ఖేర్సన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంది.
రష్యన్లు ఖాళీ చేసిన తర్వాత ఖేర్సన్ ను తిరిగి ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో దాదాపు తొమ్మిది నెలల పాటు సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు లభించిన విజయాల్లో ఇదే కీలకం.