బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత కొన్ని రోజులగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్లూరు, రాణీపేట్, కాంచీపురం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
చెన్నై సహా పలు జిల్లాలకు రానున్న రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నీలగిరి, కోయంబత్తూర్, కాంచీపురం, తిరుప్పూర్, విల్లుపురం, వెల్లూరు, సాలెం, నాగపట్నం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నైలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా రాష్ట్రంలోని దాదాపు 26 జిల్లాలకు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా శనివారం, ఆదివారం- రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
More Stories
ప్రశాంతంగా మూడో దశలో 64.58% పోలింగ్
ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడతల దుస్తులే
లష్కరే టాప్ కమాండ్ బాసిత్ అహ్మద్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం