జ్ఞానవాపి మసీదులో శివలింగం రక్షణను పొడిగింపు 

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతంలో ఉన్న ‘శివలింగం’కు ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ శుక్రవారంనాడు సుప్రీంకోర్టు  ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. 
 
జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు  మే 17న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ఇవ్వాల సుప్రీంకోర్టు పేర్కొంది.  హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఏడాది  మే 17న ఇచ్చిన ఉత్తర్వులకు రేపటితో (నవంబర్ 12) గడువు ముగియనున్న దృష్ట్యా హిందూ సంఘాలు మరోసారి కోర్టుని ఆశ్రయించాయి. శివలింగానికి సుప్రీంకోర్టు కల్పించిన రక్షణ ఈనెల 12వ తేదీతో ముగుస్తున్నందున, భధ్రతను పొడగించాలని హిందూ భక్తుల తరఫున హాజరైన అడ్వకేట్ విష్ణు శంకర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వీడియోగ్రఫీ సర్వేలో కనుగొన్న శివలింగం ఉంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని గత మే 17న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌‌ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలిచ్చింది. 
 
జ్ఞానవాపి మసీదులో ముస్లింలు నమాజు చేసుకునేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. కాగా, శివలింగం విషయంలో హిందూ వర్గాలు చేస్తున్న వాదనతో ముస్లిం వర్గాలు ఏకీభవించడం లేదు. సర్వేలో కనిపించినట్టు చెబుతున్న వస్తువు ఒక ఫౌంటేన్ అని ఆ వర్గాలు వాదిస్తున్నాయి.
 
1991 నాటి నుంచి ఈ వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన అంశమిది. అంజుమన్ ఇంతేజామియా మసీదు వారణాసి వారు, హిందూ భక్తులు, ఇతరులు కలిసి వారణాసిలోని సివిల్ కోర్టుతో పాటు అలహాబాద్ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. 
జ్ఞాన్వాపి మసీదు సమీపంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన భక్తులు 1991లో ఒక దావా వేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాశీ  విశ్వేశ్వరుని ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత జ్ఞానవాపి మసీదు నిర్మించినట్టు వారి ఫిర్యాదులో పేర్కొన్నారు.  1991లో వేసిన ఈ దావా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది.
అంతేకాకుండా జ్ఞానవాపి మసీదు సముదాయంలోని పురాతన శివాలయంలో పూజలు, కైంకర్యాల వంటి ఆచారాలు నిర్వహించాలని కోరుతూ గత ఏడాది శివ భక్తులు కొందరు మరొక దావా వేశారు. దీనిని ‘పురాతన దేవాలయం’గా పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు కూల్చివేసిన హిందూ కట్టడంలోని కొంత భాగంలో మసీదు నిర్మించారనే వాదనలను బలపరుస్తూ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే.. ఈ వాదనలు విన్న కోర్టు జ్ఞానవాపి సముదాయాన్ని సర్వే చేయాలని ఆదేశించింది. ఆ సమయంలో మసీదు వజుఖానాలో ‘శివలింగం’ ఉన్నట్టు వెల్లడయ్యింది. ఇక  అప్పటి నుంచి హిందూ సంఘాలు తమ పోరాటాన్ని విస్తృతం చేశాయి. అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు.