పదేళ్లకోసారి ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే!

ఆధార్‌కు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఆధార్ కార్డుదారులు 10 ఏళ్లకు ఒక్కసారైనా అప్‌డేట్ చేయించుకోవాలని, దానికి సపోర్టింగ్ పత్రాలను సమర్పించాలని కొత్త రూల్ తెచ్చింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ గెజిట్ ప్రకటన విడుదలచేసింది. ఆధార్‌లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ(పిఓఐ), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్(పిఓఏ) డాక్యుమెంట్లు సమర్పించాలని పేర్కొంది.
 
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి 10 ఏళ్ల పూర్తయ్యాక కార్డుదారుడి సమాచారాన్ని ధృవీకరించే పత్రాలను కనీసం ఒక్కసారైనా అప్‌డేట్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రెపాజిటరీలో  కచ్చితమైన ఆధార్ సమాచారాన్ని కొనసాగించేందుకు ఈ అప్‌డేట్ దోహదపడనుందని కేంద్రం వెల్లడించింది.

‘‘ ఆధార్ నంబర్ ఉన్న వ్యక్తులు.. ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి ధృవీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోవాలి. కనీసం ఒక్కసారైనా ఈ ప్రక్రియ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ , ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పత్రాలను సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు. సీఐడీఆర్‌లో ఖచ్చితమైన సమాచారాన్ని కొనసాగించేందుకు కాలానుగుణంగా అప్‌డేట్ చేసుకోవాలి’’ అని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.

యుఐడిఏఐ ‘అప్‌డేట్ డాక్యుమెంట్’ అని ఓ కొత్త ఫీచర్‌ని కూడా డెవలప్‌చేసింది. మై ఆధార్ పోర్టల్ లేక మై ఆధార్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లేక దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్ రంలో కూడా అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.

ఇప్పటి వరకు 134 కోట్ల ఆధార్ నంబర్లను జారీచేశారు. ఇప్పుడు ఎంత మంది అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. గత ఏడాది దాదాపు 16 కోట్ల మంది వివిధ విషయాలను అప్‌డేట్ చేసుకున్నారు. దాదాపు 650 రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, 315 కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్ అథంటికేషన్‌నే వాడుతున్నారు.