ఎమ్యెల్యేల కొనుగోలు ఆరోపణలకు సంబంధించిన ఫామ్ హౌస్ కేసులో రాజ్భవన్ను ఇరికించాలని చూశారని గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పైగా, తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు అనుమానం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కేసులో ప్రస్తావనకు వస్తున్న తుషార్ గతంలో రాజ్భవన్లో ఏడీసీగా పనిచేశారని చెబుతూ తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారని ఆమె విమర్శించారు. ఏ విషయంపై అయినా మాట్లాడేందుకు సిద్ధమని తమిళిసై స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని గవర్నర్ తమిళిసై చెబుతూ ఒక్కొక్క బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నానని, కానీ ఈ లోపే తప్పుడు ప్రచారం జరిగిందని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. బుధవారం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రిక్రూట్మెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని కేవలం వివరణ కోరానని, కానీ రిక్రూట్మెంట్ను అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిందని ఆమె తెలిపారు. బిల్లును తొక్కి పెట్టాలనుకుంటే వివరణ ఎందుకు కోరతానని ఆమె ప్రశ్నించారు.
నియామకాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందే తానని తెలిపారు. రాష్ట్రంలో ఓ విధానం అమల్లో ఉన్నప్పుడు కొత్త తరహా విధానాన్ని ప్రభుత్వం తేవాలనుకుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంగానే తనకున్న అనుమానాలపై వివరణ కోరినట్లు వెల్లడించారు.బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుపై మరిన్ని వివరాలు కావాలని అడిగానని తెలిపారు
కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధన్యత ఇచ్చానని ఆమె స్పష్టం చేశారు. అయితే, “కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు అన్నదే నా ప్రశ్న? 8 ఏళ్లుగా అనేక వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని యూనివర్సిటీల వీసీలతో మాట్లాడాను. ఆ తర్వాత డీటైల్డ్ రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి పంపా. కొత్త రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా?.. లీగల్గా ఇబ్బందులు వస్తే ఏంటి పరిస్థితి? మళ్లీ నియమాకాలు ఉంటాయా? బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు?” అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ విషయమై వివరణ కోరితే, మంత్రి సమాచారం రాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారు. “రాజ్భవన్.. ప్రగతి భవన్ కాదు. విద్యార్థులు ఎవరైనా నేరుగా రాజ్భవన్ రావచ్చు’’ అని తమిళిసై ప్రకటించారు.
ప్రభుత్వం, గవర్నర్ కొనసాగుతున్న వివాదాలలో తాజాగా యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు ప్రస్తావనకు వస్తున్నది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్భవన్కు రావాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు.
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. దాంతో, వీటి భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ బోర్డుకు అధికారాలను కల్పించడానికి యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ సెప్టెంబరు 12న ఆమోదించి, గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. అప్పటి నుంచి ఈ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, బిల్లుపై సందేహాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు విద్యా శాఖ మంత్రి రావాల్సిందిగా గవర్నర్ ఈనెల 7న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ పంపించారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి