రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ఎత్తేసిన హైకోర్టు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రయోగించిన పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన రాజాసింగ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పాటు..ఆయనపై ప్రయోగించిన పీడీయాక్టు కేసు ఎత్తివేసింది.
ఈక్రమంలో న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టకూడదని రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని నిర్దేశించింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అభ్యంతరకర పోస్ట్ లు, కామెంట్స్ చేయకూడదని తెలిపింది. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత బెయిల్ పై రాజాసింగ్ బయటకు రానున్నారు.  
‘‘ పీడీ యాక్ట్ కు బెయిల్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్ పై పెట్టిన  పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. ఈ రోజే రాజా సింగ్  విడుదల అవుతారు’’ అని బీజేపీ లీగల్ సెల్ కు చెందిన సీనియర్ న్యాయవాది ఆంటోనీరెడ్డి తెలిపారు.  రాజాసింగ్ జైలు నుంచి బయటకు వస్తే శాంతి, భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ నిన్న హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ విధించడంపై హైకోర్టులో నిన్న వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి.
రాజాసింగ్ ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని, ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఇప్పటికే 101 కేసులు ఉన్నాయని, అందులో18 కేసులు మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా చేసిన కేసులు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో రాజసింగ్ బయటికి వస్తే శాంతిభద్రత  సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు.
గతంలో రాజసింగ్ చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో ఓ వర్గం వారు నిరసనలు తెలియజేశారని ఏజీ హైకోర్టుకు గుర్తు చేశారు. ఎమ్మెల్యే రాజసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడం సరైనదేనని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ వాదించారు.
మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రవి చందర్ వాదించారు. రాజాసింగ్ ఏ మతాన్నీ కించపరిచలేదని, ఏ మతాన్ని టార్గెట్ చేయలేదని వివరించారు. కేవలం బాల్య వివాహం అనే ఒక నాటకాన్ని మాత్రమే ప్రజెంట్ చేసాడని చెప్పారు.
మహమ్మద్ ప్రవక్త అనే పదాన్ని ఎక్కడ కూడా రాజాసింగ్ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష తోనే రాజాసింగ్‌పై పిడి యాక్ట్ నమోదు చేశారని చెప్పారు. నాంపల్లి కోర్టు రీమాండ్ చెల్లదని రిజెక్ట్ చేసిందని, అందుకే పీడీ యాక్ట్‌ను పోలీసులు నమోదు చేశారని రవి చందర్ కోర్టుకు తెలిపారు.
 వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో సెప్టెంబర్ 2 న రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే (సెప్టెంబర్ 5న) ఆయనపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుంచి రాజాసింగ్ జైల్లోనే ఉంటున్నారు. మరోవంక, రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.
కమెడియన్ మునావర్ ఫారుఖీపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, పైగా హిందూ ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతున్నందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్ని తనపై తప్పుడు కేసులు బనాయించాయని రాజాసింగ్ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన వివరణలో రాజాసింగ్  పేర్కొన్నారు.