లా కమిషన్‌ చైర్మన్‌గా రుతురాజ్‌ అవస్థి

లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రుతురాజ్‌ అవస్థి నియామకమయ్యారు. అలాగే కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేటీ శంకరన్‌, ప్రొఫెసర్‌ ఆనంద్‌ పలివాల్‌, ప్రొఫెసర్‌ డీపీ వర్మ, ప్రొఫెసర్‌ ఆర్య, ఎం కరుణానిధిని కమిషన్‌ సభ్యులుగా కేంద్రం నియమించింది.
దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం సోమవారం లా కమిషన్‌ నియామకం చేపట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ 2018లో లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పదవీ విరమణ చేయగా,  అప్పటి నుంచి ఇప్పటి నుంచి లా కమిషన్‌ను నియమించలేదు.
జస్టిస్ రుతురాజ్ అవస్థి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేయగా, ఈ ఏడాది జూలైలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ధర్మాసనానికి ఆయన నాయకత్వం వహించారు.
రుతురాజ్‌ అవస్థి 1986లో లక్నో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో సివిల్, సర్వీస్ అండ్‌ ఎడ్యుకేషనల్‌ విషయాలలో ప్రాక్టీస్ చేశారు. ‘అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’గానూ సేవలందించారు.