వచ్చే నెలలో భారత్ జీ20 ప్రెసిడెన్సీ (అధ్యక్షత) చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండడం చారిత్రాత్మక ఘట్టం అని చెబుతూ ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.
`వసుధైక కుటుంబం’ అనేది భారత్ నినాదం అని, ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోదీ తెలిపారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. లోగోపై సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.
ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుండగా, ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ అందుకోనుంది. జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్ లో 200 సమావేశాలు జరగనున్నాయి. 32 విభిన్న రంగాలపై భారత్ లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది.
గురునానక్ జయంతి వేడుకల్లో ప్రధాన మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ గురునానక్ జయంతి సందర్భంగా గురునానక్ 553వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనారిటీల జాతీయ కమిషన్ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా నివాసాన్ని ప్రధాని సందర్శించారు.
ప్రధాని మోదీ గురునానక్ దేవ్కు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సిక్కు గురువుల బోధనలు, గురునానక్ జీవన విధానం ప్రపంచానికి సన్మార్గం చూపించాయని తెలిపారు. గురునానక్ దేవ్ ఆలోచనల స్ఫూర్తితో దేశం 130 కోట్ల మంది భారతీయుల సంక్షేమ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని చెప్పారు.
సిక్కుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. సిక్కుల కుటుంబీకులు ఉపాధి కోసం, వ్యాపార కార్యకలాపాల కోసం పొరుగు దేశాల కెళ్ళి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో ఇబ్బందులు పడుతున్నవారు భారతదేశం తిరిగొస్తే భారతీయ పౌరసత్వం ఇస్తామని ప్రధాని స్పష్టం చేశారు.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్