మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్న

మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే ఉపఎన్నికలో నైతిక విజయం తనదేనని ఆయన స్పష్టం చేశారు.  పోలింగ్ జరిగే సమయం (నవంబరు 3) దాకా టీఆర్ఎస్ కు చెందిన 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌరవ సైన్యం మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేసిందని మండిపడ్డారు. వాస్తవానికి అక్టోబరు 31వ తేదీ సాయంత్రం వరకు బీజేపీ ముందంజలో ఉందని గుర్తు చేశారు. 

నవంబరు 1 తర్వాత ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించి బీజేపీ కార్యకర్తలను బెదిరించారని ఆయన ఆరోపించారు. తన ఒక్కడిని ఓడగొట్టేందుకు టీఆర్ఎస్ కౌరవ సైన్యం మొత్తం మునుగోడుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయడం  మొట్టమొదటిసారిగా మునుగోడులోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు.

రిటర్నింగ్ ఆఫీసర్ పై కేసీఆర్, కేటీఆర్ బాగా ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేయిస్తే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందని కోమటిరెడ్డి చెప్పారు.  పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి బీజేపీ శ్రేణులను అష్ట దిగ్బంధం చేశారని, తనను ప్రచారం కూడా చేయనియ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చామని పేర్కొన్నారు.

‘‘ధర్మం వైపు ప్రజలు నిలిచి పోరాటం చేశారు. నిజానికి మేం గెలిచినట్టే. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిసిపోయింది. భవిష్యత్తులో తెలంగాణలో రాబోయే మార్పుకు ఇది సూచిక’’ అని ఆయన భరోసా వ్యక్తం చేశారు.  ‘‘మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా అది నంబర్ గేమ్ మాత్రమే’’ అని వ్యాఖ్యానించారు.

కారు గుర్తుకు ఓట్లు వేయకుంటే పెన్షన్లు రావని ప్రజలను బెదిరించి టీఆర్ఎస్ ఓట్లు వేయించుకుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.  ‘‘ఇది నిజమైన ఫలితం కాదు. పోలింగ్ రోజు కూడా డబ్బు, మద్యం పంచారు’’ అని చెప్పారు. ‘‘ఆరోజు తెలంగాణ కోసం పార్లమెంట్లో ఎలాగైతే కొట్లాడానో.. నా ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ పై  అదేవిధంగా పోరాడుతాను” అని స్పష్టం చేశారు.

కాగా, కేసీఆర్ అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టు నాయకులు అమ్ముడు పోయారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కనీసం ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రికి  బుద్ధి చెప్పాల్సింది పోయి కమ్యూనిస్టులకు ఆయన పంచన చేరారని దుయ్యబట్టారు.

కేసీఆర్ నైతికంగా ఓటమి చెందారు

మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, నైతికంగా బీజేపీ గెలిచిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇంతలా ప్రలోభపెట్టిన టిఆర్ఎస్‌కు ఆదరణ లేదని, వామపక్షాలు లేకపోతే టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఈటల పేర్కొన్నారు. ఫలితాల వెల్లడిలో జాప్యంపై అనుమానాలు ఉన్నాయని చెబుతూ టీఆర్‌ఎస్ ఓడితే పెన్షన్లు రద్దు అవుతాయని మంత్రులు బెదిరించారని, మంత్రులు పాలన వదిలి మునుగోడులో ఉన్నారని ఆరోపించారు. ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

పోలింగ్ సిబ్బందిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని, సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మార్వో, ఎండీవోలతో మాట్లాడే స్థాయికి దిగజారారని విమర్శించారు. పోలింగ్ ముగిసినా టీఆర్‌ఎస్ నేతలు మునుగోడులోనే ఉన్నారని, మునుగోడు ప్రజాస్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపని ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు పంచిందని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సరిగా క్యాంపెయినింగ్ చేయనివ్వలేదని, తమ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.