ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో జగిత్యాల జిల్లాపై విదేశీ మీడియా దృష్టి

ఖతార్ లో డ్యూటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురుకంటి జగన్ కుటుంబాన్ని బుధవారం ఫ్రాన్స్ టీవీ ప్రతినిధి జెర్మేన్ బస్లే ఇంటర్వూ చేశారు. ఇంటి పరిసరాలను, గ్రామాన్ని డ్రోన్ కెమెరా ద్వారా వీడియో తీసుకున్నారు.
గల్ఫ్ మృతుడి కుటుంబ సభ్యుల తెలుగు సంభాషణను ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, విదేశీ జర్నలిస్టుకు మార్గదర్శకులుగా వ్యవహరించారు.
 
ఈనెల 20న ఖతార్ లో ప్రారంభం కానున్న ప్రపంచ ఫుట్ బాల్ (ఫిఫా వరల్డ్ కప్) సందర్బంగా ఖతార్ లో ఫుట్ బాల్ స్టేడియాలు, సంబంధిత నిర్మాణ పనులు చేసేటప్పుడు చనిపోయిన ఆసియా దేశాల వలస కూలీల విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై అంతర్జాతీయ మీడియా దృష్టి పెట్టింది. 
 
ఖతార్ లో చనిపోయిన భారతీయ వలస కూలీల కుటుంబాల స్థితిగతులపై ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంగ్లీష్ దిన పత్రికలో ప్రచురితమైన బ్యానర్ వార్తా కథనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ వార్తా కథనంలో పేర్కొన్న తొమ్మిది మంది మృతుల్లో ఏడుగురు తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.
 
గల్ఫ్ వలసల విశ్లేషకులు, అంతర్జాతీయ కార్మిక నిపుణుడు మంద భీంరెడ్డి, వలస కార్మికుల హక్కుల కార్యకర్త స్వదేశ్ పరికిపండ్ల ఇద్దరు కలిసి ఈ సమాచారాన్ని ఇంగ్లీష్ పత్రికకు అందించారు.   ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా కథనంపై భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా ప్రయత్నించాలని దోహా ఖతార్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఆదేశించారు.
 
మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి ఖతార్ ఫుట్ బాల్ స్టేడియం పని ప్రదేశంలో జరిగిన మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి తెలిపారు. ఖతార్ లో జరిగిన ప్రతిపని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధం ఉన్నది కాబట్టి ఖతార్ భూభాగంలో జరిగిన ప్రతి మరణానికి ఫిఫా వరల్డ్ కప్ కమిటీ నైతిక బాధ్యత వహించి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఫుట్ బాల్ స్టేడియాలు తదితర నిర్మాణాలు, నిర్వహణ కొరకు 8 బిలియన్ డాలర్లు ఖర్చు అయింది. 17 బిలియన్ డాలర్ల లాభం చేకూరుతుందని అధికారికంగా అంచనా వేశారు.  17 బిలియన్లు అంటే 1700 కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో ఒక లక్షా 40 వేల కోట్ల రూపాయలు.
 
భారీ ఆదాయాన్ని సమకూర్చే ఫుట్ బాల్ ప్రాజెక్టులో ప్రాణాలు వదిలిన వలస కార్మికులను ఆదుకోవడం ఖతార్ తో సహా అంతర్జాతీయ సంస్థల కనీస ధర్మం అని గల్ఫ్ కాంగ్రెస్ చైర్మన్ సింగిరెడ్డి నరేష్ స్పష్టం చేశారు. గుండెపోటు, ఆత్మహత్యలు, తదితర కారణాల వలన చనిపోయిన వలస కార్మికుల మరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అధిక ఉష్ణోగ్రత మరణాలు, పని ప్రదేశంలో ప్రమాద మరణాలను నివారించగలిగే వారని ఆయన చెప్పారు.