క్రిమియాలో మాస్కో దళాలపై డ్రోన్ దాడులు 

రష్యా ఆక్రమిత క్రిమియాలో విధులు నిర్వహిస్తున్న మాస్కో దళాలపై డ్రోన్ దాడులు జరిగాయి. అయితే ఈ దాడిని క్రెమ్లిన్ నౌకాదళం సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు శనివారం వెల్లడించారు. కనీసం నాలుగు డ్రోన్ లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు.  కెర్చ్ వంతెన పేలుడుతో రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ… ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

క్రిమియా లోని సెవాస్టోపోల్ పోర్ట్ వద్ద విధుల్లో ఉన్న మాస్కో నల్లసముద్రం నౌకాదళం లక్షంగా శనివారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సెవాస్టోపోల్ గవర్నర్ మైఖెల్ రజ్వోజయెవ్ టెలిగ్రామ్‌లో వెల్లడించారు. కొన్ని గంటల పాటు మాస్కో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దాడులను తిప్పి కొట్టాయని పేర్కొన్నారు.

అన్ని మానవ రహిత వాహనాలను రష్యా నేవీ కాల్చివేసినట్టు తెలిపారు. ఈ దాడుల్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగలేదని, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. అయితే ఈ దాడుల్లో రష్యాకు చెందిన పలు యుద్ధ నౌకలు దగ్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. 

తీర ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్మేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన నేపథ్యంలో హార్బర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఇదిలా ఉండగా, ఈ దాడి ఉక్రెయిన్ సైన్యం జరిపి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. 

కొద్ది రోజుల క్రితమే సెవాస్టోపోల్ సమీపంలోని ఓ థర్మల్ విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది. క్రిమియాను, రష్యాను కలిపే వంతెనను ఉక్రెయిన్ ఇటీవలే పేల్చి వేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా దాడులను ముమ్మరం చేసింది. రష్యా ఆక్రమిత క్రిమియా లోని మాస్కో సేనలపై డ్రోన్ దాడులు జరగడం ఉద్రిక్తతలను మరింత పెంచే ఆస్కారముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.