జి-20 సదస్సులో ప్రధాని మోదీతో ఋషి సునాక్ భేటీ

బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు త్వరలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా నవంబర్‌లో జరగనున్న జీ-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్.. ప్రపంచ ఆర్థిక శక్తులుగా వికసించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి అధినేతలు సమ్మతం తెలిపారు. ఇండోనేషియాలో జరిగే టీ20 సదస్సులో వీరివురూ పరస్పర చర్చలు జరుపుతారు’’ అని ప్రకటనలో పేర్కొంది.
కాగా కొత్తగా బ్రిటన్ పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా గురువారం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వ్యక్తిగతంగా శుభాభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఇరుదేశాల మధ్య ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ అంశాన్ని రిషి సునాక్ దృష్టికి తీసుకెళ్లారు.
పరస్పర సంభాషణ అనంతరం ఇరువురూ ట్విటర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఒప్పందం దీపావళి నాటికల్లా పూర్తవుతుందని అంతా భావించారు. కానీ బ్రిటన్‌లో అస్థిర ప్రభుత్వం కారణంగా ముందుకు కదల్లేదు.