అమెరికాలో గ్యాంగ్‌స్టర్ నితీష్ కౌశల్‌

అమెరికాలో గ్యాంగ్‌స్టర్ నితీష్ కౌశల్‌
ఒక కీలక పరిణామంలో, అమెరికాలో హత్య, కిడ్నాప్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ నితీష్ కౌశల్‌ను, మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చిన కొద్ది రోజులకే, ఎఫ్‌బిఐ శుక్రవారం అరెస్టు చేసింది. “వెర్మాంట్‌లో నితీష్ కౌశల్‌ను అరెస్టు చేశాం,” అని ఎఫ్‌బిఐ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌లో తెలిపింది. 
 
వెర్మాంట్‌లో గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియాకు నితీష్ కౌశల్ అనుచరుడు. కేవలం రెండు రోజుల క్రితమే అతడిని ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో చేర్చారు. ‘ఆపరేషన్ హార్డ్ బాల్’ కింద, భారత సంతతికి చెందిన గ్యాంగ్‌స్టర్ల సిండికేట్‌లపై ఎఫ్‌బిఐ నిరంతర చర్యలు తీసుకుంటోంది. భారత జాతీయుడైన కౌశల్, భగవాన్‌పురియా వ్యవస్థీకృత నేర సమూహం తరఫున కిడ్నాప్‌లు, దాడులతో సహా పలు హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఎఫ్‌బిఐ తెలిపింది. 
 
భారత సంతతికి చెందిన గ్యాంగ్‌స్టర్లతో కూడిన వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్న ఎఫ్‌బిఐ చొరవ అయిన “ఆపరేషన్ హార్డ్ బాల్” కింద ఈ అరెస్టు జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ఏజెన్సీ అటువంటి సిండికేట్‌లపై నిరంతర ఆపరేషన్లు నిర్వహిస్తోంది. మంగళవారం నాడు ఎఫ్‌బిఐ కౌశల్‌ను తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.
 
 హత్య, కిడ్నాప్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ, ఆయుధాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక అంతర్జాతీయ నేర సంస్థతో సంబంధం ఉందనే ఆరోపణలపై ఎఫ్‌బిఐ కౌశల్ కోసం గాలిస్తోంది. జగ్గు భగవాన్‌పురియా ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉద్భవించిందని, కాలిఫోర్నియాలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్. ఇతర ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఎఫ్‌బిఐ తెలిపింది. 
 
రాకెటీర్ ప్రభావం, అవినీతి సంస్థల కుట్ర ఆరోపణలపై, లాస్ ఏంజిల్స్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్, జూన్ 25న కౌశల్‌పై ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  ఈ వారం ప్రారంభంలో నమోదైన అభియోగాలపై స్పందిస్తూ, ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
 
 “అనేక దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ వ్యవస్థీకృత నేర ముఠాలపై తీసుకున్న చర్యలు, నమోదైన అభియోగాలకు సంబంధించి అమెరికా న్యాయ శాఖ చేసిన ప్రకటనలను మేము గమనించాము,” అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరాలు,  ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, అమెరికా దేశాల మధ్య “బలమైన,   పెరుగుతున్న సహకారం” ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.