నవంబర్‌ 1 నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టిక్కెట్లు

టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్ధం నవంబర్‌ 1 నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీని పున: ప్రారంభిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12న తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశామని గుర్తు చేశారు. 
 
భక్తుల విజ్ఞప్తిమేరకు వీటిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భూదేవి, కాంప్లెక్సు, శ్రీనివాసం, రైల్వేస్టేషన్‌ వెనుకగల రెండవ సత్రంలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని వివరించారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
ఏరోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లను అదే రోజు మంజూరు చేస్తామని,  కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తారని పేర్కొన్నారు. ఈ కౌంటర్లలో కంప్యూటర్లు, కెమెరాలు, ఆధార్‌ నమోదు వ్యవస్థ, తాగునీరు, క్యూ లైన్‌లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. టోకెన్లు దొరకని భక్తులు తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్సు-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పారు.

బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు
కాగా, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో రాత్రివేళ వేచివుండే భక్తులకు ఉదయం త్వరతిగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తామని తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్‌ దర్శన చేసుకునే అవకాశం ఉందని, తిరుమలలో గదుల పై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరుపతిలోని మాధవంలో గదులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని, డిసెంబర్‌ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని ఈవో చెప్పారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు ఆఫ్‌లైన్‌ టికెట్లు మాధవంలోనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు.