మూడు రాజ‌ధానుల పేరుతో డ్రామాలాడొద్దు

మూడు రాజ‌ధానుల పేరుతో డ్రామాలు ఆడొద్ద‌ని అధికార పార్టీ వైసీపీ నాయ‌కుల‌ను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు హెచ్చ‌రించారు. అమరావతి రైతుల పాదయాత్రపై దాడి చేయటం, అడ్డుకోవడం ఊక దంపుడు చర్య అని ధ్వజమెత్తారు. అమరావతి రైతులు సిక్కోలు వరకు ఎందుకు రాకూడదో చెప్పాలని నిలదీశారు. 
 
వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగే పనులు తప్పా ఒక్క పనైనా చేపట్టారా అని వైసిపి నేతలను ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో విబేధాలు సృష్టించటం మానుకోవాలని హితవుపలికారు. అమరావతి రైతులపై అక్కసుతోనే వికేంద్రీకరణ అంటున్నారని మండిపడ్డారు. 
రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు తప్ప అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రూ.800 కోట్లు ఖర్చు పెడితే సిక్కోలు సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. 
 
 స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మానకు ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తెచ్చే దమ్ము ఉందా అని నిలదీశారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని జగన్ చెప్పారని, మరి ఇప్పుడు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వికేంద్రీకరణ గురుంచి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.
పేద‌ల ఇళ్ల‌కు జ‌గ‌న‌న్న పేరు పెట్టుకోవ‌డానికి వీల్లేద‌ని, ఇదే విష‌యాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. పీఎం ఆవాస్ యోజ‌న పేరు పెట్ట‌క‌పోతే నిధులు నిలిపివేస్తామ‌ని సోము వీర్రాజు హెచ్చ‌రించారు.