వినువీధిలో కనువిందు చేసిన సూర్యగ్రహణం

ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ పలు ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని చూశారు. తెలంగాణలో సైతం పలు ఏరియాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది.  ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎందుకంటే చాలా ఏండ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ కనిపించదట. భారతదేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.  ఇవాళ్టి గ్రహణం భారత్‌లోని జైపూర్, నాగ్ పూర్, ద్వారక, చెన్నై, ముంబై, కోల్‌కతా తదితర నగరాల్లో కనిపించింది. సరిగ్గా ఇవాళ సాయంత్రం 4.29 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. సాయంత్రం 6.26 గంటల వరకు కొనసాగింది.
హైదరాబాద్‌లో సాయంత్రం 4.59 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభం కాగా.. ఢిల్లీలో సాయంత్రం 4.29 గంటలకు, కోల్‌కతాలో సాయంత్రం 4.52 గంటలకు, చెన్నైలో సాయంత్రం 5.14 గంటలకు, ముంబైలో 4.49 గంటలకు, ద్వారకలో 4.36 గంటలకు, తిరువనంతపురంలో 5.29 గంటలకు, నాగ్‌పూర్‌లో 4.49 గంటలకు గ్రహణం మొదలైంది.
గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడంతో పలువురు ప్రత్యేక పరికరాల సాయంతో వీక్షించారు. ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న సంభవించింది. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది.
గ్రహణం సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జనం బయట తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సూర్య గ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.