కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా మృతి

ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న జాన్ షా..తుదిశ్వాస విడిచారు. 
జాన్ షా వయస్సు 73 సంవత్సరాలు. బెంగళూరులోని విల్సన్ గార్డెన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కిరణ్‌ షా ట్విట్టర్‌లో  “జాన్‌ నీ ఆత్మకు శాంతి చేకూరాలి..నా జీవితాన్ని ప్రత్యేకంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు..మిమ్మల్ని మేం మిస్‌ అవుతున్నాము” అంటూ జాన్‌ షాతో తాను కలిసున్న ఫోటోను షేర్‌ చేశారు.
 
1998లో జాన్ షా,  కిరణ్ మజుందార్ షా వివాహం జరిగింది.  యూకేలోని గ్లాస్గో యూనివర్శిటీలో జాన్ షా హిస్టరీ, పొలిటికల్ ఎకానమీలో ఎంఏ చేశారు.  మధురా కోట్స్ లిమిటెడ్ కు ఛైర్మన్ గా, కోట్స్ వియెల్లా గ్రూప్ నకు ఫైనాన్స్, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు. బయోకాన్ లిమిటెడ్ కు కూడా వైస్ ఛైర్మన్ గా పని చేశారు.
వీరి వివాహం తర్వాత జాన్ షా బయోకాన్ లో చేరారు. 1999 నుంచి బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో సభ్యులుగా ఉన్నారు.  2001లో కంపెనీ వైస్ ఛైర్మన్ గానూ నియమితులయ్యారు. కంపెనీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా, విదేశీ ప్రమోటర్ గా వ్యవహరించారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందుకు 2001లో యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన తొలి భారతీయ కంపెనీగా బయోకాన్‌ నమోదైంది. జాన్ షా మృతి పట్ల పలువురు పారిశ్రామికవేత్తలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.