ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా సిబ్బందికి, తమిళనాడుకి చెందిన కొంతమంది లా విద్యార్థులకు మధ్య జరిగిన గొడవ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. 
 
ప్రస్తుతం వడమాలపేట టోల్ ప్లాజా వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే కారణంతో రాకపోకలను నిలిపివేశారు. వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. 
 
తమిళనాడు నుంచి ఏపీలోకి వెళ్లే అన్ని వాహనాలను చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. అత్యవసరం అనుకున్న వారినే పంపిస్తున్నారు.  తమిళనాడుకు చెందిన కొందరు లా విద్యార్థులు పుత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతూ, తిరుపతిలో పరీక్షలు రాస్తున్నారు. తిరుపతిలో చివరి పరీక్షా వ్రాసి వస్తుండగా ఈ ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో వడమాలపేట మండంలోని టోల్ ప్లాజా వద్దకు రాగానే పన్ను చెల్తిస్తుండగా కొన్ని వాహనాలకు ఉన్న ఫాస్ట్ ట్యాగ్ లు పని చేయలేదు.  దీంతో పన్ను చెల్లింపులో కొంత ఆలస్యమైంది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో త్వరగా టోల్ చెల్లించాలని సిబ్బంది కోరారు.  దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లా విద్యార్థులు టోల్ ప్లాజా సిబ్బందితో గొడవకు దిగి, వారిపై హెల్మెట్స్ తో దాడికి దిగారని తెలుస్తోంది. అక్కడే ఉన్న కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేశారని టోల్ ప్లాజా సిబ్బంది ఆరోపించారు.
ఈ ఘటనతో అక్కడ చాలాసేపు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వాహనదారులు లా విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. టోల్ సిబ్బందితో పాటు కొంతమంది వాహనదారులపై కూడా లా విద్యార్థులు దాడి చేశారని తెలుస్తోంది.
విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న వడమాలపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై వారు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా, విద్యార్థులు వారితో కూడా ఘర్షణకు దిగారు.
చిన్న వివాదం పెద్దగా మారిందని, ఇది రెండు రాష్ట్రాల గొడవల్లా చూడొద్దని పోలీసు అధికారులు కోరారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల వారు ఎప్పటిలానే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని కోరారు.