అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం

అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం ఏర్పడింది. పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాజధాని రైతులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని రైతులు స్పష్టం చేశారు. 
 
కోర్టుకు సెలవులు ఉండటంతో పాదయాత్రకు నాలుగు రోజులు తాత్కాలిక విరామమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు. రామచంద్రాపురంలో ఏర్పడ్డ ఉద్రిక్తతల నేపథ్యంలో  అమరావతి జేఏసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో శనివారం 41వ రోజు రామచంద్రపురం నుంచి ప్రారంభం కావల్సిన అమరావతి రైతుల మహాపాదయాత్ర ఆగింది.

నేడు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామంచంద్రాపురం బైపాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రైతులు బస చేస్తున్న ఫంక్షన్‌ హాల్‌ను ఈ ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. రైతులను కలిసి మద్దతు తెలిపేందుకు బయట నుంచి వచ్చేవారిని సైతం అనుమతించలేదు. 

 
సంఘీభావం తెలిపేందుకు వస్తున్నవారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని, అనుమతి ఉన్న వాహనాలు కాకుండా మిగతావి అంగీకరించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. 
 
దీంతో రైతులు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని రైతులు తెలిపారు. ఆ తర్వాత పాదయాత్రకు విరామం ఇస్తున్నట్టు రైతులు ప్రకటించారు.
ఐక్య కార్యాచరణ సంఘ నేతలు సమావేశమై పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
 
 ” పోలీసులు మాహిళలను తీవ్రంగా గాయపరిచారు. మహిళల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. పాదయాత్రకు తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించాం. తదుపరి కార్యాచరణ చర్చించి ప్రకటిస్తాం” అని తెలిపారు. 
 
“ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళతాం. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగానే తాత్కాలిక విరామం ప్రకటించాం. కోర్టు మార్గదర్శకాలతో అరసవల్లి వరకు పాదయాత్రను కొనసాగిస్తాం ” అని ఐకాస నేతలు స్పష్టం చేశారు.