మునుగోడులో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన రోజే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయ్యిందని చెబుతూ మునుగోడులో కూడా తాను గెలిచాక టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ లో ప్రతి ఒక్కరు అసంతృప్తిగా ఉందన్నారని చెబుతూ ఇక్కడ ప్రచారానికి వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం మంది తాను గెలవాలని కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. కొందరు తనకు నేరుగా ఫోన్ చేసి చెబుతున్నారని తెలిపారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తన సోదరుడితో పాటు చాలా మంది కమ్యూనిస్టు నాయకులు, ఇతర పెద్ద నాయకులు కూడా రాజగోపాల్రెడ్డికి ఓటు వేయాలని చెబుతున్నారని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లేనని పేర్కొంటూ బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏకమయ్యాయని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడే కొద్ది కేసీఆర్కు నిద్రపట్టడం లేదని, ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రాజగోపాల్రెడ్డి ఎద్దేవాచేశారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందని ఆయనకు అర్థమైందని తెలిపారు. బీజేపీకి రోజురోజుకూ అనుకూలంగా నివేదికలు వస్తున్నాయని, ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా, ఎన్ని సర్వేలు చేసినా తన గెలుపును ఆపలేరని రాజగోపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు కేసీఆర్, జగదీష్ రెడ్డి ఆస్తులెంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఏనిమిదేళ్లు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించిందని ఆయన ఆరోపించారు.
నిజంగా రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోతే ఒక్కడిని ఓడించడానికి టీఆర్ఎస్ మంద ఎందుకు మునుగోడులో ప్రచారం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎప్పుడు డబ్బు రాజకీయాలు చేయదని స్పష్టం చేస్తూ ఏడ్చే మగాన్ని నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.
బీజేపీని ఓడగొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తుందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డికి, కవితకు వ్యాపార లావాదేవీలు నడుస్తున్నాయని తెలిపారు. మొన్ న జరిగిన లిక్కర్ స్కాంలో రేవంత్ కి కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు. మునుగోడు తీర్పు తెలంగాణ భవిష్యత్తుపై ఆధారపడిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెబుతూ ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదని తేల్చి చెప్పారు. మునుగోడు ప్రజలను సీఎం అవమానించారని అంటూ తాను రాజీనామా చేసిన తర్వాతనే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి ఇంకా 10 రోజుల సమయం ఉందని చెబుతూ నవంబర్ 3న జరగబోయే ధర్మయుద్ధంలో అందరు పాల్గొనాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వకుండా ఓట్ల కోసం అకౌంట్లో డబ్బులు జమచేశారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపు 9 వేల మందికి రూ. 90 కోట్ల రూపాయలు జమచేశారని చెప్పారు.
అయితే ఆ డబ్బుల్ని గొల్లకుర్మలు డ్రా చేసుకోకుండా అకౌంట్లను సీఎం ఫ్రీజ్ చేయించారని కోమటిరెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఫ్రీజ్ చేయించిందని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. గొల్లకుర్మలు బాధపడొద్దని, కేంద్రమంత్రి నిర్మలాసీతామన్ తో మాట్లాడి అకౌంట్లో ఫ్రీజ్ అయిన డబ్బులను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేగానీ ప్రలోభాలకు లొంగి గొల్లకుర్మలు టీఆర్ఎస్ కు ఓటేయొద్దని హెచ్చరించారు. అవసరమైతే తన ఆస్తులు అమ్మైనా గొల్లకుర్మలకు డబ్బు ఇస్తానని భరోసా ఇచ్చ. రు
కాగా, తనకు మద్దతుగా తన సోదరుడైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ పై స్పందిస్తూ అందులో తప్పేమి ఉందని ప్రశ్నించారు. తాను హుజురాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ లో ఉండి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించాలని కోరానని ఆయన గుర్తు చేశారు.
ఇపుడు తమ సోదరుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పాడని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత పార్టీ నాయకుడితో ఫోన్ లో మాట్లాడుతూ మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తే ఆ తర్వాత తను టిపిసిసి ప్రెసిడెంట్ అవుతానంటూ ఆ ఫోన్ కాల్ లో మాట్లాడినట్టు ఆ ఆడియో కాల్ ని బట్టి అర్థమవుతుంది.
ఆ తర్వాత తను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని అందులో పేర్కొన్నారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చచ్చినా, బతికినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారని, ఉప ఎన్నికలో ఓటు ఆయనకే వేయాలని ఫోన్ కాల్ రిక్వెస్ట్ చేశారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది