హిమాచల్‌ప్రదేశ్‌లో తిరిగి బిజెపి ప్రభుత్వమే

పీపుల్స్‌పల్స్‌ సర్వే వెల్లడి 

నవంబర్‌ 12వ తేదీన జరిగే హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమే అని  పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన సర్వేలో స్పష్టమౌతోంది. ప్రస్తుత ధోరణుల ప్రకారం బిజెపికి స్వల్ప ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు వెల్లడైంది. దానితో ఒకే పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇవ్వని హిమాచల్‌ప్రదేశ్‌ ఓటర్ల రికార్డును ఈ సారి బీజేపీ తిరగరాసే అవకాశాలు స్పష్టం అవుతున్నాయి.
 
హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో పీపుల్స్‌పల్స్‌ సంస్థ సర్వే ప్రకారం అధికార బిజెపి పార్టీకి 35 నుండి 40 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీకి 25 నుండి 30 స్థానాలు, ఆమ్‌ఆద్మీ పార్టీకి 1 నుండి 2 స్థానాలు, ఇతరులకు 0 నుండి 2 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 35 స్థానాలు.
 
 పీపుల్స్‌పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం అధికార బిజెపి పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువలో ఉంది.  బిజెపి పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పార్టీ గట్టిపోటీనే ఇస్తోంది. ఆమ్‌ఆద్మీపార్టీ వల్లే కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోంది. 
 
ఆమ్‌ఆద్మీ పార్టీకి లభించే ఓటు శాతాల్ని బట్టి, అదెలాగూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుంది కనుక కాంగ్రెస్‌ అవకాశాలకు గండిపడి ఆ మేర వారికి నష్టం జరుగొచ్చు.  ఈ ప్రభావకమే బిజెపి గెలుపుకు ముఖ్య కారణం అయినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. 
 
పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన మూడ్‌సర్వే ప్రకారం బిజెపికి 42 శాతం, కాంగ్రెస్‌కు 38 శాతం, ఆమ్‌ఆద్మీ పార్టీకి 6 శాతం, ఇతరులకు మిగిలిన ఓట్లు లభించే అవకాశం ఉన్నట్లు స్పష్టమౌతోంది. చిన్న రాష్ట్రం కావడం, నియోజకవర్గాల్లో తక్కువ సంఖ్యలో ఓటర్లుండటం వంటి అంశాల వల్ల గెలుపోటముల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల కూడా అంచనాలు కొంచెం అటిటు కావొచ్చు.
 
అక్టోబర్‌ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్‌ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ, పొలిటికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ స్కాలర్స్‌తో కలిసి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 120 పోలింగ్‌ స్టేషన్లలో, 1500 సాంపిల్స్‌తో నిర్వహించిన మూడ్‌సర్వే ప్రకారం జనాభిప్రాయం విస్పష్టంగానే అధికార బిజెపి పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. 
 
రాష్ట్ర జనాభాలో ప్రధానంగా ఉన్న రైతాంగం, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు… తదితరులందరినీ తగు నిష్పత్తిలో కలుస్తూ శాస్త్రీయంగా సేకరించిన జనాభిప్రాయం అప్పటి పరిస్థితిని ప్రతిబింబించింది. ఇంకా అప్పటికి ఖరారు కాని అభ్యర్థిత్వాలు, తాజా ఎన్నికల హామీలు, ఆఖరు నిమిషపు ఎత్తుగడలు… వంటి కీలకాంశాలు తుది ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది కూడా ఇక్కడ ప్రధానమే.
 
మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? అన్నది ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం దాన్ని చూడబోతే  ప్రతి ఎన్నికలప్పుడూ ప్రత్యర్థి పార్టీకి అధికారం మార్చే పద్దతికి రాష్ట్ర ప్రజలు విరామం ఇచ్చి, ప్రస్తుత పాలకపక్షం బీజేపీకే తాజా ఎన్నికల్లో తిరిగి పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
వచ్చేనెల 12న ఒకే విడతలో పోలింగ్‌ జరుగనున్న 
ఈ కొండలు`లోయల రాష్ట్రంలో ఎప్పటిలాగే బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధానంగా తలపడుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించాలని ఉవ్విల్లూరుతూ, తగు ప్రణాళికలు రచిస్తున్న ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) పార్టీకి ప్రచారంలో, ప్రజాదరణలో జనక్షేత్రం నుండి ఆశించిన స్థాయిలో లేదు. ప్రభావం మాత్రం ఉంది. 
 
ఢల్లీి, పంజాబ్‌ రాష్ట్రాల్లో పాగా తర్వాత ఇరుగుపొరుగునున్న చిన్న రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ పై దృష్టి సారించినట్టు ‘ఆప్‌’నేతలు చెప్పుకున్నా, ఆ స్థాయిలో ఇక్కడ పార్టీ విస్తరించలేదు. మిగతా రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడే స్థాయిలో లేవు. వాటి ప్రభావం కూడా అంతంతే. 
 
రెండు ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు సుదీర్ఘ కాలంగా నేతృత్వం వహించిన సీనియర్‌ నాయకులు వీరభద్రసింగ్‌(మరణం), ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌(వృద్దాప్యం) ఛత్రఛాయ లేకుండా, తదుపరి తరం హయాంలో జరుగుతున్న ఎన్నికలివి. 
 
దేశ వ్యాప్తంగా ‘ఎన్నికల రాజకీయాల్లో’ బీజేపీ బలపడుతూ ఉంటే, మరో పక్క కాంగ్రెస్‌ బలహీనపడుతున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలు వచ్చాయి. పన్నెండు జిల్లాలుగా విస్తరించి ఉన్న ఈ కొండలు లోయల రాష్ట్రంలో గ్రామీణ జనాభాయే యెక్కువ. 
 
68.64 లక్షల మొత్తం జనాభాలో, 3226 గ్రామ పంచాయతీలూ, హ్యామ్లెట్లలో కలిపి 89 శాతం జనాభా నివసిస్తోంది. ఎస్సీలు 25 శాతం మంది ఉన్నారు. బిజెపి ప్రభుత్వంపై నిర్దిష్టంగా బలమైన ప్రజావ్యతిరేకత ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ గడచిన కాలంలో నిర్మించిన ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. 
 
రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలో ఉండటం బీజేపీకి కలిసి వచ్చింది. అందుకే బిజెపికి 42 శాతం ఓట్‌షేర్‌, కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్‌షేర్‌ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీకి 6శాతం ఓట్‌షేర్‌ పొందే అవకాశాలున్నాయి. 
 
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు బిజెపికి బలమైన యంత్రాంగం ఉంది. దానికితోడు పటిష్ట పునాదులతో ఆరెస్సెస్‌ వ్యవస్థ వేళ్లూనుకొని ఉండటం పార్టీకెంతో దన్నుగా ఉంది. ఇది కాకుండా బీజేపీకి రాష్ట్రంలో నిశ్శబ్ద ఓటు బ్యాంక్‌ ఉంది, తుది ఫలితాన్ని అదే పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసే అవకాశాలున్నట్టు పీపుల్స్‌పల్స్‌ మూడ్‌సర్వేలో స్పష్టమౌతోంది.
 
బిజెపి, కాంగ్రెస్‌, ఆప్‌, కమ్యూనిస్టు తదితర ప్రధాన రాజకీయ పార్టీల బలం`బలహీనతల్లో చోటుచేసుకునే ఆఖరు నిమిషపు మార్పులూ తుది ఫలితాల సరళిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 
 
దానికి తోడు… కుల, వర్గ సమీకరణాలతో అభ్యర్థుల ఎంపికలో వ్యూహ`ప్రతివ్యూహాలు, యాపిల్‌ రైతుల ఆవేదన, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రవర్ణ ‘స్వర్ణ ఆయోగ్‌’ రాజకీయ ఎత్తుగడలు, ఇతర కుల సంఘాల, కూటముల ప్రణాళికలు….. తదితరాంశాలు పోలింగ్‌ తేదీ సమీపిస్తుంటే గెలుపోటమి అవకాశాల్లో స్వల్పంగా మార్పులు జరుగవచ్చు. 
 
ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలే అధిక సంఖ్యాకులైనప్పటికీ సుదీర్ఘ కాలంగా రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులే ఇక్కడి రాజకీయాల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకొని శాసిస్తుంటారు.పార్టీ ఏదైనా ముఖ్యమంత్రులు ఆయా వర్గాల నుండే ఎంపిక అవుతున్నారు. బిజెపికి అన్ని నియోజకవర్గాల్లో, వివిధ స్థాయిల్లో నాయకుల, కార్యకర్తలు శ్రేణులుండటం సానుకూలాంశం. ముఖ్యమంత్రిగా జైరామ్‌ ఠాకూర్‌కు మంచి పేరుండటం, ఆయన పదవీ కాలం పెద్ద వివాదాలేమీ లేకుండా గడచిపోవడం ఈ ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూర్చే అంశమే.
రాష్ట్రం మొత్తమ్మీద ప్రభావం చూపగలిగిన ప్రత్యర్థి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీరభద్రసింగ్‌, జీఎస్‌ బాలీ మరణం వల్ల ఏర్పడ్డ ఖాళీ ఇంకా అలాగే  ఉండటం బీజేపీకి లాభించేదే. దానికి తోడు, పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇటీవలే, పార్టీ వరుసగా రెండో సారి అధికారం దక్కించుకోవడం పార్టీ శ్రేణులకు నైతిక బలం.
నిరుద్యోగ సమస్య, ఉద్యోగస్థులకు పాత పెన్షన్‌ స్కీమ్‌ పునరుద్దరణ హామీ నెరవేర్చకపోవడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకపోవడం వంటివి అధికార బిజెపి పార్టీకి ప్రతికూలాంశాలు. పార్టీ అంతర్గత విబేధాలు, ముఖ్యంగా జైరామ్‌ ఠాకూర్‌, పి.కె.ధూమల్‌ వర్గాల మధ్య పోరు వంటివి బిజెపి పార్టీకి నష్టం చేసే అవకాశాలున్నాయి.
హిమాచల్‌లో కాంగ్రెస్‌ పార్టీకీ కలిసి వచ్చే పలు సానుకూలాంశాలున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జనావాసంలోనూ పార్టీ పాదముద్రలుండటం, ఇప్పటికీ చెక్కుచెదరని కార్యకర్తల వ్యవస్థ కాంగ్రెస్‌కు బలం. ప్రతిసారీ విపక్షానికి పట్టం గట్టే రాష్ట్ర ఓటర్ల మనస్తత్వం ‘ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్‌దే’ అనే చర్చకు దారితీస్తోంది. 
 
పైగా 2021లో ఉప ఎన్నికలు జరిగిన ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో అంతటా కాంగ్రెస్‌ గెలవటం ఆ పార్టీకి పెద్ద బూస్టింగ్‌ లాంటిదే. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీనియర్‌ నేతలు లేకపోవడం, ఇటీవలి ఎన్నికల్లో ఒక రాష్ట్రంలోనైనా గెలువకపోవడం వంటివి పార్టీ శ్రేణుల నైతిక స్థయిర్యాన్ని బాగా కృంగదీస్తోంది. 
 
 పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి ప్రతిభాసింగ్‌కు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వకపోవడం తదితర అంశాలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆమ్‌ఆద్మీ పార్టీ విస్తరణ కూడా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ విజయావకాశాలను ఎంతో కొంత గండికొట్టేదే కావడం పార్టీకి ప్రతికూలాంశం.
 
68 అసెంబ్లీ నియోజకవర్గాలకు అన్నీ రాజకీయపార్టీల అభ్యర్థులు ఖరారై, అన్ని ప్రధాన పక్షాల ప్రచారాస్త్రాలన్నీ బయటకు తీసి, తమ తమ ఎత్తుగడలతో పోటీదారులు బరిలో నిలిచాక వాస్తవిక రాజకీయ చిత్రం క్రమంగా ఆవిష్కృతం అవుతోంది. పోలింగ్‌ తదనంతర పరిణామాల్లోనూ, ప్రభావాలు ఏవో మరింత స్పష్టత వస్తుంది. పోల్‌ అనంతరం పోస్ట్‌పోల్‌ సర్వే నిర్వహించి, ఫలితాలను, అందుకు కారణమైన అంశాలను లోతుగా ‘పీపుల్స్‌ పల్స్‌’ సంస్థ విశ్లేషించనుంది.