ఇక రైతులకు ఒకే బ్రాండ్ కింద అన్ని సబ్సిడీ ఎరువులు

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన కింద “వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్” అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మేళన్ 2022 సందర్భంగా జరుగుతున్న రెండు రోజుల కార్యక్రమంలో సింగిల్ బ్రాండ్ భారత్ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు.
 
సబ్సిడీ ఎరువుల అక్రమ మార్గంలో తరలింపుకు చెక్ పెట్టేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద యూరియా, డి అమ్మోనియా ఫాస్ఫేట్ (డీఎపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఒపి), ఎన్‌పికే వంటివి ఒకే బ్రాండ్ కింద విక్రయాలు జరుగుతాయి.  అంతేకాక సుమారు 600 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను (పీఎంకేఎస్‌కే) కూడా ప్రారంభించారు. ఇవి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు అందించడమే కాకుండా బహుళ సేవలను అందించే ఒక షాపుగా పనిచేస్తుంది.
 
దేశంలో దాదాపు 3.5 లక్షలకు పైగా ఉన్న రిటైల్ దుకాణాలను పీఎంకేఎస్‌కేగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ కేంద్రాలలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటివి అందించడమే కాకుండా మట్టి, విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్ష సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
 
ఇండియన్ ఎడ్జ్ మ్యాగజైన్ ప్రారంభం
 
 ప్రధాని మోదీ  ఈ రెండు రోజుల కిసాన్ సమ్మేళన్ కార్యక్రమంలో “ఇండియన్ ఎడ్జ్” అనే ఈ మ్యాగజైన్ కూడా ప్రారంభించారు. దీనిలో దేశీయ, అంతర్జాతీయ ఎరువుల సమాచారం. ఇటీవల ఉన్న ధరలు, అభివృద్ధి, వినియోగాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తదితరులు పాల్గొన్నారు.
12వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల
 
పిఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 12వ విడతగా రూ. 16,000 కోట్లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. దాదాపు 11 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ మొత్తం పంపిణీ జరుగుతుంది. దీంతో ఇప్పటివరకు రైతులకు ఈ పథకం రూ. 2.16 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పించినట్లయింది.
 
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పిఎం–కిసాన్) కింద అర్హులైన రైతులకు ప్రతి మూడు నెలలకు రూ. 2,000 చొప్పున ఏడాదికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందచేస్తోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ డబ్బు జమ అవుతుంది.  2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభం కాగా 2018 డిసెంబర్ నుంచే ఇది అమలులోకి వచ్చింది. దేశ రాజధానిలోని పూసా క్యాంపస్‌లో జరుగుతున్న రెండు రోజుల పిఎం– కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022లో ప్రధాని నరేంద్ర మోడీ 12వ విడత మొత్తాన్ని విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ  ప్రసంగిస్తూ పిఎం కిసాన్ ప్రయోజనాలు లబ్ధిదారులకు మధ్యవర్తులు, కమిషన్ ఏజెంట్ల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. 12వ విడత నిధులు దీపావళి పండుగకు ముందే రైతులకు చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.