రూపాయి విలువ తగ్గడం లేదు.. డాలర్ విలువ పెరుగుతోంది

భారత రూపాయి విలువ పతనం కావడం లేదని, కానీ, అమెరికా డాలర్​ రేటు బలపడుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ఆర్థిక మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువను డాలర్​ అధిగమించిందని ఆమె  చెప్పారు. 

రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 82.69కి చేరిన కొద్ది రోజులకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డాలర్ బలపడటమే రూపాయి పతనానికి కారణమని ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అధిక అస్థిరతను నివారించడంలో ఆందోళన చెందుతోందని, భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించడానికి మార్కెట్‌లో తాము జోక్యం చేసుకోవడం లేదని ఆర్థిక మంత్రి నిర్మల  స్పష్టం చేశారు.

అమెరికా డాలర్  రేట్లు పెరగడం వల్ల భారతీయ రూపాయి విలువ తగ్గుతూ వస్తోందనేది వాస్తవం. డాలర్ కు అనుకూలంగా మారకం రేటు పెరిగింది. అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీల కంటే భారతీయ రూపాయి చాలా మెరుగ్గా ఉంది అని ఆమె వివరించారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం తాజా రౌండ్ తరుగుదల ప్రతికూల ప్రపంచ పరిణామాల ఫలితంగా ఉంది. ఇది ఇంతకు ముందు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రారంభమైంది. ఈ ఏడాది జరిగిన వార్​తో వస్తువుల ధరలు పెరిగాయి.

ఫలితంగా అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచడానికి ప్రేరేపించింది. దీని ఫలితంగా  భారత కరెన్సీ విలువ తగ్గిపోతూ వస్తోంది అని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. అయితే పరిస్థితులు అదుపు తప్పకుండా అవసరమైన చర్యలు తీసుకొంటున్నామని ఆమె పేర్కొన్నారు.

కాగా, భారత దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. నిర్దిష్ట  నేరాలకు సంబంధించి ప్రాధమిక ఆధారాలు లభిస్తే ఎక్కడికైనా దర్యాప్తుకు వెడుతుందని ఆమె తెలిపారు. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లతో సహా పలు పశ్చిమ దేశాలు  ఇంధనం కోసం తిరిగి బొగ్గు వైపు చూస్తున్నాయని ఆమె తెలిపారు. గ్యాస్ ఇంధనం ధరలు అందుబాటులో లేకపోతూ ఉండడంతో భారత్ తో పాటు పలు దేశాలు బొగ్గు  ఉపయోగించక తప్పడం లేదని ఆమె చెప్పారు.