రష్యా ఆయుధాగారంపై ఉక్రెయిన్‌ సైన్యం దాడి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతూనేఉన్నది. తమ రాజధాని కీవ్‌పై పుతిన్‌ సేనలు బాంబులతో విరుచుకు పడిన నాలుగు రోజుల తర్వాత ఆ దేశానికి చెందిన ఆయుధాగారంపై ఉక్రెయిన్‌ బలగాలు దాడులు చేశాయి. దీంతో భారీ పేలుళ్లతో ఆయుధాగారం ధ్వంసమై పోయింది. 
 
రష్యా సరిహద్దుల్లోని బెల్‌గరోడ్‌ రీజియన్‌లో ఉన్న ఓ గ్రామంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్‌ సైన్యం క్షిపణులతో దాడికి పాల్పడిందని గవర్నర్‌ వ్యచెస్లేవ్‌ గ్లాడ్‌కోవ్‌ తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ శబ్ధంతో కూడిన మంటలు ఎగసిపడ్డాయని, ఆయుధ డిపో ధ్వంసమైందని చెప్పారు.
బెల్‌గరోడ్‌లోని నివాస సముదాయాలపై కూడా ఉక్రెయిన్‌ బలగాలు బాంబులు విసిరాయని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్‌ సైన్యం తోసిపుచ్చింది.  కాగా, నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. బాంబుల మోతతో కీవ్‌లోని షెవ్చెంకో ప్రాంతం దద్దరిల్లింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు.
మరోవంక, ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది. రష్యా సమాఖ్య భద్రతా మండలి డిప్యూటీ సెక్రెటరీ అలెగ్జాండర్‌ వెనెడిక్టోవ్‌ స్థానిక మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

నాటోలో ఉక్రెయిన్‌ చేర్చుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే విషయం కీవ్‌కు కూడా తెలుసుని పేర్కొన్నారు. తమకు నాటో కూటమిలో ఫాస్ట్‌ట్రాక్‌ సభ్యత్వం కల్పించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరిన కొద్దిరోజులకే రష్యా నుంచి మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరిక వెలువడింది.