ఉక్రెయిన్‌పై ర‌ష్యా క్షిపణుల దాడులు..8 మంది మృతి

ఉక్రెయిన్‌పై సోమవారం ర‌ష్యా విరుచుకుప‌డింది. రష్యా ప్రయోగించిన క్షిపణుల కారణంగా కీవ్‌లో పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. కీవ్‌లోని షెవ్చెంకో ప్రాంతంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు కీవ్‌ మేయర్‌ విటాలి క్లిట్ష్కో వెల్లడించారు. 

షెవ్చెంకో ప్రాంతం కీవ్‌ నగరం మధ్యలో ఉంటుంది. ఇది చారిత్రక పాత నగరం. అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పేలుళ్ల కారణంగా 8 మంది మృతి చెందారని, 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌ నేషనల్‌ యూనివర్శిటీ ప్రధాన భవనానికి సమీపంలో ఒక పేలుడు సంభవించింది.

నాలుగు నెలల విరామం తర్వాత కీవ్‌పై రష్యా దాడులకు దిగడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌లోని ఇతర నగరాలపై కూడా రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న లివివ్‌ నగరంలో కీలక మౌలిక సదుపాయాలపై రష్యా రాకెట్లు సంధించింది. భారీ విధ్వంసాన్ని సృష్టించింది.

 ఇవాళ ఉదయం దాదాపు 75 క్షిపణులు ఒకదాని తర్వాత ఒకటిగా కీవ్ నగరాన్ని కుదిపేశాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసినా పేలుళ్ల శబ్దాలు, ప్రజల హాహాకారాలు, సైరన్లు, అంబులెన్స్ ల మోతలు  వినిపించాయి. పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి.   రష్యా క్షిపణి దాడులు ప్రధానంగా కీవ్ నగరంలోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు లక్ష్యంగా జరిగాయని నగర మేయర్ విటాలీ క్లిట్ షికో సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

గత కొద్దిరోజులుగా క్రిమియాకు ఉత్తర ప్రాంతం, జపోరిజియాలోనే రష్యా-ఉక్రెయిన్‌ సేనల మధ్య భీకర పోరు జరుగుతోంది. జపోరిజియాపై రష్యా ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ మాత్రం గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉంది. ఇటీవల రష్యా-క్రిమియాను కలిపే ప్రధాన వంతెనపై జరిగిన పేలుడు యుద్ధ తీవ్రతను పెంచింది. 

ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దాడి వెనక ఉక్రెయిన్ ప్రత్యేక దళాల హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రష్యా దర్యాప్తు ప్రారంభించినట్లు పుతిన్ తెలిపారు. అందుకు ప్రతీకారంగానే నెలల విరామం తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

 భారీ పేలుళ్ల శ‌బ్ధాలు ఆ ప్రాంతంలో వ‌ణుకు పుట్టిస్తున్నాయి.  కీవ్ న‌గ‌రంపై మిస్సైళ్లు, డ్రోన్లు భీతావాహం సృష్టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.ఫిబ్ర‌వ‌రిలో ఉక్రెయిన్‌పై అటాక్ మొద‌లుపెట్టిన ర‌ష్యా.. తొలిసారి కీవ్ సిటీ సెంట‌ర్‌ను టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. లివివ్‌, డిప్రో, జ‌పొరోజియా న‌గ‌రాల్లోనూ తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు జ‌రుగుతున్నాయి.క్షిప‌ణుల దాడి వ‌ల్ల కీవ్‌లో స‌బ్‌వే రైళ్ల‌ను నిలిపివేశారు.