ప్రాజెక్ట్ మౌసమ్ – జలధిపుర యాత్రపై రెండు రోజుల జాతీయ సదస్సు

రుతుపవనాలు, ఇతర వాతావరణ కారకాలను ప్రభావితం చేసే మార్గాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ  ‘ప్రాజెక్ట్ మౌసం’ను ప్రారంభించింది. వివిధ సందర్భాలలో హిందూ మహాసముద్ర ప్రాంతంలోని వివిధ దేశాల మధ్య పరస్పర చర్యలను అర్థం చేసుకునేందు ఇది ఉపయోగపడుతుంది. 
 
ఖతార్‌లోని దోహాలో 2014లో జరిగిన యూనెస్కొ 38వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) నిర్వహిస్తోంది. 
పరిశోధనను మరింత  ప్రోత్సహించడం అలాగే ఈ విషయంపై అవగాహనను విస్తృతం చేసే లక్ష్యంతో ఈ ఏడాది అక్టోబర్ 7, 8 తేదీల్లో న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ఏఎస్‌ఐ నిర్వహించింది.  “జలధిపురయాత్ర: ఎక్స్‌ప్లోరింగ్ క్రాస్-కల్చరల్ లింకేజీస్ అలాంగ్ ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్” కాన్ఫరెన్స్ సముద్ర వాతావరణం,  పరస్పర చర్యలపై అనేక రకాల అంశాలను చర్చించింది.

సాంస్కృతిక, పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  అర్జున్ రామ్ మేఘవాల్, సాంస్కృతిక, విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ఈ సదస్సును ప్రారంభించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో పాటు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పలు హిందూ మహాసముద్ర ప్రాంతీయ దేశాల రాయబారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 
 ఇతర దేశాలతో భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై నిష్పాక్షికమైన పరిశోధన  అవసరాన్ని మీనాక్షి లేఖి ఈ సందర్భంగా వివరించారు. ప్రాజెక్ట్ మౌసమ్  లక్ష్యాలు, పరిధిపై భారతదేశ సముద్ర వారసత్వానికి చెందిన సంక్షిప్త రూపురేఖలతో కూడిన బ్రోచర్, భారతదేశ ప్రపంచ వారసత్వ ఆస్తుల జాబితాను ఈ సందర్భంగా విడుదల చేశారు.
 
హిందూ మహాసముద్ర రిమ్ దేశాల విశిష్ట రాయబారులతో రెండవ రోజు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కు అధ్యక్షత వహించిన మీనాక్షి లేఖి ప్రాజెక్ట్ మౌసమ్‌కు సంబంధించిన అంశాలను ముఖ్యంగా వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, మసాలా వంటకాలు, వాస్తుశిల్పం, కనిపించని సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన ఇతర అంశాల గురించి రాయబారులతో చర్చించారు.