సౌర విద్యుత్ వినియోగంలో భారత్ ముందడుగు

సౌర విద్యుత్ ను వినియోగించుకునే దిశగా భారత్ ముందడుగు వేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  గుజరాత్ లో ఆదివారం  మూడు రోజుల పర్యటనను ప్రారంభించిన ప్రధాని రూ. 14,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 

24 గంటల సౌర  విద్యుత్ గ్రామాన్ని అధికారికంగా ఆయన ప్రకటించారు. దీంతో దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్  గ్రామం గుజరాత్ లోని మోధేరా ఆవిష్కృతం అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  ఇప్పటి వరకు మోధేరా గ్రామం సూర్యదేవ ఆలయానికి మాత్రమే ప్రసిద్ధని, ఇప్పుడు సూర్యదేవ గ్రామంగా కొలుస్తారని పేర్కొన్నారు. 

 ‘‘ఇప్పటివరకూ ఈ ఊరి ప్రజలు ప్రభుత్వం సరఫరా చేసే విద్యుత్ ను మాత్రమే వాడుకుని బిల్లులు కట్టారు. ఇప్పుడు ఇంటింటా సౌర విద్యుత్ వాడకంతో 60% నుంచి 100% వరకూ విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం తప్పింది. ప్రజలు తాము ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ ప్యానెళ్లతో తమ విద్యుత్ ను తామే ఉత్పత్తి చేసుకోవచ్చు. సౌర విద్యుత్ ను అమ్మి డబ్బులు కూడా సంపాదించొచ్చు” అని ప్రధాని తెలిపారు.

21వ శతాబ్ధం నాటికి మన శక్తికి అవసరమైన విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. మోధేరా, మోహసానా తో పాటు ఉత్తర గుజరాత్ కు కొత్త శక్తి వచ్చిందని చెప్పారు. విద్యుత్, నీరు, రోడ్డు, రైలు, డెయిరీ, స్కిల్ డెవలప్ మెంట్, హెల్త్ కేర్ కు సంబంధించిన చాలా ప్రాజెక్టులు ప్రారంభించామని మోదీ  తెలిపారు. 

‘‘ఒకప్పుడు గుజరాత్ లో సైకిళ్లు కూడా తయారయ్యేవి కాదు. ఇప్పుడు కార్లు కూడా తయారు చేస్తున్నాం. రాష్ట్రంలో విమానాలను తయారు చేసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు” అని ప్రధాని చెప్పారు.  గ్రామంలో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ ను నిల్వ  చేసేందుకు సూర్యదేవాలయానికి 6 కిలోమీటర్ల దూరంలోని సుజ్జన్ పురా వద్ద ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’ను ఏర్పాటు చేశారు.

అనంతరం మోధేరాలోని మోధేశ్వరి మాత ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సూర్యమందిరాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి సందర్శించారు.

దేవాలయంలో విద్యుదీకరణ, 3డీ ప్రొజెక్షన్ సౌర విద్యుత్ తోనే ఏర్పాటు చేశారు. ప్రధాని కలల సాకారం గుజరాత్ ముందు వరుసలో ఉందని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారా దేశ విద్యుత్ అవసరాలు 50 శాతం తీరాలన్న సంకల్పానికి తగ్గట్లు పని చేస్తున్నామని చెప్పారు.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టం ద్వారా స్థానిక సూర్యదేవాలయంతో పాటు  మోధేరా గ్రామ సౌర విద్యుదీకరణ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్ ప్రభుత్వం 18 ఎకరాల భూమి కేటాయించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 80.66 కోట్ల నిధులను కేటాయించాయి. మోధేరా గ్రామంలో 1కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ను లక్షా 30 వేలకు పైగా అమర్చినట్లు అధికారులు తెలిపారు. 

 కాగా, ప్రధాని మోదీ  సోమ, మంగళవారాల్లో భరూచ్, జామ్ నగర్ లో పర్యటించనున్నారు. భరూచ్​లో రూ. 8 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం అహ్మదాబాద్ లో సివిల్ హాస్పిటల్​కు, మరికొన్ని ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపనల కార్యక్రమాల్లో కూడా ప్రధాని మోడీ పాల్గొననున్నారు.