ముంబై ఎయిర్‌పోర్టులో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తు మత్తు మందు హెరాయిన్‌ పట్టుబడింది. దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పకడ్బందీ సమాచారం మేరకు మలావీ నుంచి వస్తున్న ప్రయాణికులపై కన్నేసి ఈ మత్తు మందును పట్టుకున్నట్లు తెలుస్తున్నది.

ఆఫ్రికన్ దేశమైన మలావీ నుంచి ఖతార్ మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన కచ్చితమైన సమాచారం మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాపు కాశారు.

 అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. మలావీ ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయగా ట్రాలీ బ్యాగు కావిటీస్‌ తయారుచేసి దాచిన 16 కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఢిల్లీలోని ఒక హోటల్‌లో బస చేసిన ఘనా మహిళను కూడా అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగా ఉంటుందని, ప్రయాణికులను అరెస్ట్ చేయడంతో స్థానిక కోర్టు డీఆర్‌ఐ కస్టడీకి తరలించింది.