చిరుత‌పులి పిల్ల‌కి పాలు ప‌ట్టించిన యోగి ఆదిత్య‌నాథ్

చిరుత‌పులి పిల్ల‌కి పాలు ప‌ట్టించారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్. వెటర్నరీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న చిరుత పిల్లను ఒడిలోకి తీసుకొని డబ్బాతో పాలు తాగించారు. ఆ చిన్నారి చిరుతకు చండీ అని పేరు పెట్టారు. అనంతరం..అక్క‌డి వైద్య ఆరోగ్య‌ అధికారులతో మాట్లాడారు.
 
వన్య‌ప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా గోరఖ్​పుర్​లోని అష్ఫక్ ఉల్లాఖాన్ జువాలాజికల్ పార్క్​ను  స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు.
ఆయన చుట్టూ పశువైద్యులు ఉండగా పాల సీసాతో పులి పిల్లకు పాలు పట్టారు. చిరుత పిల్ల తొలుత పాలు తాగేందుకు సంశయించింది. చేతులకు రక్షణ కోసం రబ్బరు గ్లోవ్స్ ధరించిన యోగి ఆ తర్వాత దానిని తన ఒళ్లోకి తీసుకుని మళ్లీ పాలు తాగించేందుకు ప్రయత్నించారు. ఈసారి అది పాలను గటగటా తాగేసింది.
 
ఈ సందర్భంగా తెల్ల పులి గీతను జంతు ప్రదర్శన శాలలో విడిచిపెట్టారు. రెండున్నర నెలల క్రితం ఈ పులిని ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే రెండు చిరుత‌ పిల్లలకు నామకరణం చేశాడు. ఒక పిల్ల‌కు చంఢీ, మ‌రో దానికి భ‌వాని అని పేర్లు పెట్టారు. అనంత‌రం ఆ పిల్ల‌ల‌ను గోరఖ్‌పూర్ జూలాజికల్ పార్కుకు తరలించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం కిథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్‌పూర్ బంగర్ గ్రామంలో చిరుత పులి పిల్ల కనిపించింది. గ్రామస్తులు ఆ పిల్లను ఎత్తుకుని గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం రేంజర్ జగన్నాథ్ కశ్యప్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పిల్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.
అప్పుడు ఆ పిల్ల వయస్సు రెండు-మూడు వారాలే. దానికి ‘సింబి’ అనే పేరు పెట్టారు. అనంత‌రం.. ఏప్రిల్ 8న గోరఖ్‌పూర్‌లోని జూలాజికల్ పార్కుకు పిల్లను పంపించారు. గోరఖ్‌పూర్‌లోనే దీనికి ఇప్పుడు ‘చండీ’ అనే కొత్త పేరు పెట్టారు.  ఇప్పుడు ఆ పిల్ల వయసు ఆరు నెలల 18 రోజులు. దాని బరువు 11.65 కిలోలు. దానికి ఆహారంగా.. ఉడికించిన, పచ్చి మాంసం, చికెన్ సూప్ మొదలైన వాటిని అందిస్తారు.
 
 షహీద్ అష్ఫక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్‌గా పిలిచే గోరఖ్‌పూర్ జూను గతేడాది మార్చిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. పూర్వాంచల్ ప్రాంతంలో ఇదే తొలి జూ పార్క్ కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడోది.