చైనా వెళ్తున్న ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు

ఇరాన్-చైనా ప్యాసింజర్ విమానం ఢిల్లీకి చేరుకునే సమయంలో బాంబు బెదిరింపు రావడంతో భారత వైమానిక అధికారులు అప్రమత్తమయ్యారు. మహాన్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినప్పుడు భారత గగనతలంలో ఉంది. 

అయినా సాంకేతిక కారణాల వల్ల భారతదేశంలో చైనా వెళ్లే విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతి నిరాకరించారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ ప్రకారం చైనా వెళుతున్న ఐఆర్ఎం 081 విమానం ఇరాన్‌లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళుతోంది.

 ఇవాళ ఉదయం 9 గంటల 20 నిమిషాలకు విమానం భారత భూభాగంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే ఢిల్లీ ఎయిర్ పోర్టును భారత వైమానిక దళం అప్రమత్తం చేసింది.  

విమానం ల్యాండ్‌ చేసేందుకు అనుమతి కోరగా  జైపూర్‌ లేదా చండీఘడ్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయాలని అధికారులు సూచించారు. కానీ విమానం ఎక్కడా ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ఇష్టపడలేదు. ఆ సమాచారం అందుకున్న  భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఆ విమానాన్ని అనుసరించాయి.  

పైలట్‌ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించారు. అప్పుడు విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ చూపించిందని ఢిల్లీ ఏటీసీ వర్గాలు తెలిపాయి.  ఢిల్లీలో అనుమతించకపోవడంతో పైలట్‌ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించారు.

విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అయితే, ఇప్పటి వరకు విమానంలో బాంబు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని తెలుస్తున్నది. ఆ విమానం ఇరాన్‌లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళ్తున్నట్లు ఢిల్లీ ఏటీసీ వర్గాలు తెలిపాయి.