ఓట్ల కోసం టిఆర్ఎస్ వీధి నాటకాలు

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం వీధి నాటకాలు ఆడుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టం చేసిందని పేర్కొంటూ 200 టన్నుల ఇనుప నిక్షేపాలు ఉంటేనే స్టీల్ ప్లాంట్ పెట్టాలనే నిబంధన ఉందని ఆయన గుర్తు చేశారు.  స్టీల్ ప్లాంట్ పెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని టాస్క్ ఫోర్స్ కమిటీ చాలా స్పష్టంగా పేర్కొందని చెప్పారు. 

ప్రజా సమస్యలను, పరిపాలనను కేసీఆర్ గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడుపు కోవడం కోసం కేంద్రంపై, బీజేపీపై కేసీఆర్ కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయంగా కేసీఆర్ కుటుంబపై పెరుగుతున్న వ్యతిరేకతతో బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై అర్ధ రహిత విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్రం సహకరించకపోయినా స్టీల్ ప్లాంట్ పెడుతామని 2018లో కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తూ  దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ పెట్టి 10 నుంచి 15 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. 

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. పైగా, కేసీఆర్ కుటుంబమే హామీ ఇచ్చి మాట తప్పిందని పేర్కొన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తేలిందని తెలిపారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడితే అంతర్జాతీయ పోటీని తట్టుకోలేమని చెప్పారు. 

రాష్ట్రంలో లిక్కర్, ల్యాండ్, ఇసుక, మైనింగ్ మాఫియా నడుస్తోందని  కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని దయ్యబట్టారు. ‘తెలంగాణ మోడల్ అంటే సెక్రటేరియట్ కు ముఖ్యమంత్రి రాకుండా ఉండడం మోడలా? ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టడం మోడలా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యేలు మంత్రులుగా లేకపోవడం తెలంగాణ మోడలా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ సగం రోజులు ప్రగతి భవన్ లో, సగం రోజులు ఫాంహౌజ్ లో ఉంటారని  చెబుతూ మిమ్ములను దేశ ప్రజలు ఏం చూసి స్వాగతం పలుకుతారు? అని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందరు తెలంగాణ ఉద్యమకారులు బాధపడుతున్నారని
ఒక కుటుంబం కోసం ఉద్యమాలు చేశామా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కిషన్ రెడ్డి  చెప్పారు. 

త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు, గురుకులాల విద్యార్థులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యారంగం దయనీయమైన పరిస్థితిలో ఉందని చెబుతూ  ఇప్పటి వరకూ తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ‘స్వచ్ఛ మిషన్’ కింద అవార్డు ఇచ్చామని చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై వివక్షత ఉంటే అవార్డులు ఎందుకు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ కటుంబం, టీఆర్ఎస్ నేతల దోపిడీ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపిచ్చారు. గిరిజనులకు పోడు భూములను ఏడాది లోపు ఇస్తామని 2018లో చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ కాంట్రాక్టర్స్ కూడా పెండింగ్ బకాయిల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట ధర్నాలు చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయని నిలదీశారు.