అతిపెద్ద డిఫెన్స్ ఎక్స్‌పో కు ఆతిధ్యం ఇవ్వనున్న గాంధీనగర్

గాంధీనగర్ లో పెద్దఎత్తున డిఫెన్స్  ఎక్స్‌పో 2022 నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో రక్షణ శాఖ సహాయ  మంత్రి అజయ్ భట్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, ఇతర రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గుజరాత్ లోని గాంధీనగర్ లో 2022 అక్టోబర్ 18 నుంచి 22 వరకు డిఫెన్స్  ఎక్స్‌పో 2022 జరగనున్నది. దీనిలో పాల్గోడానికి సెప్టెంబర్ 27 నాటికి 1,136 సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న స్థలంలో 2022 డిఫెన్స్  ఎక్స్‌పో జరగనున్నది. ఇంతపెద్ద విస్తీర్ణంలో డిఫెన్స్  ఎక్స్‌పో ను నిర్వహించడం ఇదే తొలిసారి. మునుపటి డిఫెన్స్  ఎక్స్‌పో 76,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న స్థలంలో జరిగింది. ‘పాత్ టు ప్రైడ్’ ప్రధాన అంశంగా డిఫెన్స్  ఎక్స్‌పో 2022 జరుగుతుంది.

జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో భారత వైమానిక, రక్షణ రంగాలను బలోపేతం చేసి స్వావలంబన సాధించి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు అద్దం పట్టే విధంగా డిఫెన్స్  ఎక్స్‌పో 2022 జరగనున్నది. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ విధానానికి రక్షణ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. రక్షణ రంగంలో భారతదేశం శక్తి సామర్ధ్యాలను ప్రతిబింబించే విధంగా రక్షణ రంగ పరిశ్రమలు డిఫెన్స్  ఎక్స్‌పో 2022లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాయి. 

భారతీయ కంపెనీల కోసం మొట్టమొదటి   ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిఫెన్స్  ఎక్స్‌పోగా డిఫెన్స్  ఎక్స్‌పో 2022 నిలుస్తుంది. భారతదేశంలో సంస్థలు, విదేశీ ఒఈఎం కలిగిన భారత దేశ అనుబంధ సంస్థలు, భారతదేశానికి చెందిన సంస్థతో   జాయింట్ వెంచర్ కలిగి ఉన్న ఎగ్జిబిటర్ సంస్థలు భారతీయ సంస్థలుగా పరిగణిస్తారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు పరిధి నుంచి రక్షణ రంగ సంస్థలుగా ఏర్పడిన  ఏడు కొత్త రక్షణ కంపెనీలు మొదటి వార్షికోత్సవం డిఫెన్స్  ఎక్స్‌పో 2022 లో జరగుతుంది. ఈ ఏడు సంస్థలు తొలిసారిగా డిఫెన్స్  ఎక్స్‌పో లో పాల్గొంటున్నాయి.  అయిదు రోజుల పాటు డిఫెన్స్  ఎక్స్‌పో 2022 జరుగుతుంది.

అక్టోబర్ 18-20 వరకు వ్యాపార కార్యక్రమాలు జరుగుతాయి. అక్టోబర్ 21, 22 తేదీల్లో ప్రదర్శనను సందర్శించడానికి ప్రజలను అనుమతిస్తారు. డిఫెన్స్  ఎక్స్‌పో ప్రదర్శన తొలిసారిగా నాలుగు వేదికల్లో జరగనున్నది. ప్రారంభ కార్యక్రమం, సదస్సులు  2022 మహాత్మా మందిర్ కన్వెన్షన్ లో జరుగుతాయి. హెలిప్యాడ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రదర్శన, సబర్మతి నది తీరంలో  ప్రత్యక్ష ప్రదర్శనలు, పోర్ బందర్ వద్ద ఇండియన్ నేవీ  ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలను సందర్శించడానికి ప్రజలకు అవకాశం కల్పిస్తారు. 

భారతదేశం -ఆఫ్రికా దేశాల మధ్య రెండో దఫా  రక్షణ రంగ చర్చలకు  డిఫెన్స్ ఎక్స్‌పో 2022 ఆతిథ్యం ఇస్తుంది. చర్చల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన  పలువురు రక్షణ మంత్రులు పాల్గొంటారు.  హిందూ మహా సముద్ర ప్రాంతం కోసం ప్రత్యేక సదస్సు నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి.

‘పాత్ టు ప్రైడ్’ పేరుతో ఏర్పాటయ్యే  ఇండియా పెవిలియన్  స్వదేశీ రక్షణ ఉత్పత్తుల పరిపక్వత, స్టార్టప్‌లు, రక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా తాజా సాంకేతికతను ప్రదర్శిస్తుంది మరియు 2047 కోసం రూపొందించిన ప్రణాళిక వివరాలు  ప్రదర్శిస్తుంది. 50కి పైగా స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను పెవిలియన్‌లో ప్రదర్శిస్తాయి.